Covid 19: దేవుడికి మొక్కుకున్నారు.. గుండు చేయించుకున్నారు!
ABN , First Publish Date - 2022-01-02T17:57:18+05:30 IST
కోవిడ్-19 వల్ల తమ గ్రామంలో ప్రాణ నష్టం జరగకుండా
భోపాల్ : కోవిడ్-19 వల్ల తమ గ్రామంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడినందుకు మధ్య ప్రదేశ్లోని దేవ్రి ఖవాసా గ్రామస్థులు దేవ్నారాయణ్ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. 90 మందికిపైగా సామూహికంగా తలనీలాలు సమర్పించారు. ఈ దేవాలయానికి స్త్రీ, పురుషులు, బాలలు ప్రదర్శనగా వెళ్లి, అన్నదానం చేశారు.
నీముచ్ జిల్లాలోని దేవ్రి ఖవాసా గ్రామస్థుడు అంబాలాల్ పాటిదార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, 2021లో కోవిడ్-19 మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నపుడు ఈ గ్రామంలో దాదాపు 30 మందికి ఈ వ్యాధి సోకింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వ్యాధి వల్ల తమ గ్రామస్థులెవరూ మరణించకుండా కాపాడాలని దేవ్ నారాయణ్ స్వామిని కోరుకున్నారు. తమ గ్రామస్థులందరినీ రక్షిస్తే, తలనీలాలు సమర్పించి, అన్నదానం చేస్తామని మొక్కుకున్నారు. కోరినట్లుగానే ఈ గ్రామస్థులెవరూ ఈ వ్యాధి కారణంగా మరణించలేదు. కొందరిని ఈ వ్యాధి తీవ్రంగా బాధించినప్పటికీ, వారు కోలుకోగలిగారు. దీంతో శుక్రవారం దాదాపు 90 మంది తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఈ గ్రామంలో 2,500 మంది వరకు ఉంటారు.