మా అక్క జీవితాన్నే మార్చేసింది: కంగన
ABN , First Publish Date - 2021-06-22T06:48:49+05:30 IST
యోగా తన కుటుంబానికి ఎంత సాయపడిందో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివరించారు.
యోగా తన కుటుంబానికి ఎంత సాయపడిందో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివరించారు. ‘‘మా అక్క రంగోలి 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ ప్రేమోన్మాది ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. అక్క ముఖంలో సగభాగం కాలిపోయింది. ఒక కంటి చూపు కోల్పోయింది. ఛాతీకి కూడా తీవ్రగాయాలయ్యాయి. చెవి దాదాపు కరిగిపోయింది. 2, 3 ఏళ్ల లో 53 శస్త్ర చికిత్సలు చేశారు. ఆమె మానసికంగా కుంగిపోయింది. మాతో మాట్లాడటం మానేసింది. అప్పట్లో ఎయిర్ఫోర్స్ అధికారితో అక్కకు నిశ్చితార్థం జరిగింది.
యాసిడ్ దాడి తర్వాత కాలిన ముఖాన్ని చూసి అతను మళ్లీ తిరిగి రాలేదు. అప్పటి నుంచి అక్క ఎవరితోనూ మాట్లాడలేదు. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అక్కకు ఎలా సాయం చేయాలో అర్థం కాలేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేదాన్ని. యోగా తరగతులకు కూడా తీసుకెళ్లా. యోగా చేయడం ప్రారంభించినప్పటి నుంచి అక్కలో అనూహ్య మార్పులు వచ్చాయి. తన బాధలపై స్పందించడమేగాక, మాట్లాడడం ప్రారంభించింది. కంటి చూపు కూడా మెరుగుపడింది’’ అని కంగన తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న తన తల్లికి కూడా యోగా ఉపకరించిందన్నారు.