మా నాన్న చనిపోయారు..!
ABN , First Publish Date - 2021-09-17T05:32:35+05:30 IST
ఆస్తి తమ పేరిట మార్పించుకునేందుకు బతికున్న తండ్రి పేరిట మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు.
- పొలం కోసం కొడుకుల దుశ్చర్య
- బతికుండగానే మరణ ధ్రువీకరణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
అవుకు, సెప్టెంబరు 16: ఆస్తి తమ పేరిట మార్పించుకునేందుకు బతికున్న తండ్రి పేరిట మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఆ తరువాత ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుని.. తండ్రి పేరిట ఉన్న పొలాన్ని తమ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. పొలంపై రుణం తీసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఈసీ అడిగితేగానీ తండ్రికి ‘తను మరణించిన విషయం’ తెలియరాలేదు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవుకు మండలం వేములపాడులో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆయన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గిద్దలూరు బాల తిమ్మయ్యకు వెంకట లక్ష్మమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. వెంకటలక్ష్మమ్మ 1989లో చనిపోయారు. ఆ తరువాత 1992లో బాల తిమ్మయ్య రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. బాల తిమ్యయ్యకు వేములపాడులో 6.40 ఎకరాల పొలం, నంద్యాలలో 5.30 సెంట్ల స్థలం ఉన్నాయి. దాదాపు 35 సంవత్సరాల క్రితం నంద్యాలకు వీరి కుటుంబం వలస వెళ్లింది. అక్కడే జీవనం సాగిస్తున్నారు. నంద్యాలలో స్థలాన్ని నలుగురు కొడుకులకు రాసిచ్చాడు. పొలాన్ని ఇంకా పంచలేదు. మొదటి భార్య కుమారులు ముగ్గురు వేములపాడులో ఉన్న పొలాన్ని దక్కించుకోవాలని అనుకున్నారు. తండ్రి బతికుండగానే 2020 మే 30న చనిపోయినట్లు బేతంచెర్ల పంచాయతీలో రిజిస్టర్ చేయించారు. మరణ ధ్రువీకరణ పత్రం సంపాదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న నంద్యాల రెవెన్యూ ఆఫీసులో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ సంపాదించారు. జూన్ 7వ తేదీన అవుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేములపాడులోని 6.40 ఎకరాలు భూమిని ముగ్గురు కొడుకులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాల తిమ్మ య్య ఆ భూమిపై లోను తీసుకుందామని అనుకున్నాడు. సబ్ రిజిస్ర్టార్ కార్యాల యానికి వెళ్లి ఈసీ తీసుకున్నాడు. దీంతో పొలం తన పేరిట కాకుండా, తన ముగ్గురు కొడుకుల పేరిట ఉన్నట్లు తేలింది. బతికుండగానే తాను మరణించినట్లు సర్టిఫికెట్లు పుట్టించి, మోసగించిన ముగ్గురు కొడుకులపై బాలతిమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరుగకపోతే కలెక్టర్, ఎస్పీని కలుస్తానని తెలిపాడు. బాలతిమ్మయ్య కొడుకులను పిలిపించి విచారిస్తామని ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు.