అన్ని దానాల్లో అవయవ దానం గొప్పది
ABN , First Publish Date - 2022-05-22T04:59:54+05:30 IST
బ్రెయిన్ డెడ్తో మృతిచెందిన యువ విద్యార్థి మోక్షిత్ అవయవ దానానికి తల్లిదండ్రులు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్సీ శేరి సుభా్షరెడ్డి అన్నారు.
యువ విద్యార్థి అకాల మృతి బాధాకరం
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ/మెదక్ అర్బన్, మే 21: బ్రెయిన్ డెడ్తో మృతిచెందిన యువ విద్యార్థి మోక్షిత్ అవయవ దానానికి తల్లిదండ్రులు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్సీ శేరి సుభా్షరెడ్డి అన్నారు. ఈనెల 18న రాత్రి ఫిట్స్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందిన మోక్షిత్ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. విద్యార్థి మృతదేహాన్ని శనివారం మెదక్లోని స్వగృహానికి తీసుకురావడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్సీ శేరి సుభా్షరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ, స్థానిక నాయకులు పరామర్శించారు. మోక్షిత్ తన అవయవదానంతో తొమ్మిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించి మన మధ్య చిరంజీవిగా బతికే ఉన్నాడని వారు పేర్కొన్నారు. అవయవదానానికి మోక్షిత్ తల్లిదండ్రులు రాయకంటి శ్రీనివాస్, జ్యోతి ముందుకు రావడం ఎందరికో స్ఫూర్తి కలిగించిందని, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతకు ముందు మోక్షిత్ మృతదేహం మెదక్కు చేరుకోగానే వెల్కమ్ బోర్డు నుంచి మృతుడి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు.