ధగధగలు!
ABN , First Publish Date - 2020-05-28T09:06:39+05:30 IST
లాక్డౌన్ ప్రభావంతో మూతపడిన బంగారం దుకాణాలు ఎట్టకేలకు తెరచుకున్నాయి. వినియోగదారులతో
- - తెరచుకున్న బంగారం దుకాణాలు
- - ఒకేరోజు రూ.2కోట్లకుపైగా లావాదేవీలు
నరసన్నపేట, మే 27: లాక్డౌన్ ప్రభావంతో మూతపడిన బంగారం దుకాణాలు ఎట్టకేలకు తెరచుకున్నాయి. వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఉగాది, అక్షయ తృతీయ పర్వదినాల్లో సైతం బంగారం దుకాణాలు తెరచుకోలేదు. దీంతో చాలా మందికి ఉపాధి కరువైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం నుంచి దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో లాక్డౌన్కు ముందు ఆభరణాలను బెత్తాయించిన వారంతా బంగారం దుకాణాల వద్దకు పరుగులు తీయడంతో పండుగ వాతావరణం కనిపించింది. జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, కాశీబుగ్గ, రాజాం, టెక్కలి, సోంపేట, పాలకొండ తదితర పట్టాణాల్లో 600కు పైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే రూ.2కోట్ల వరకు క్రయవిక్రయాలు సాగాయి. లాక్డౌన్కు పూర్వం తులం బంగారం రూ.44వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 54 వేలు ఉంది. అంతర్జాతీయంగా బంగారం దిగుమతులు నిలిచిపోవడంతో స్థానికంగా ఉన్న నిల్వల మేరకే వ్యాపారులు విక్రయిస్తున్నారు.
నిబంధనలు తుస్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను కొంతమంది వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. ఏకంగా దుకాణాల్లో 20 నుంచి 30 మంది వరకు అనుమతి ఇస్తున్నారు. కచ్చితంగా మాస్క్లు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లను వినియోగించాలి. భౌతిక దూరం పాటించే విధంగా మార్కింగ్ చేపట్టాలి. దుకాణాల్లో పిల్లలు, వృద్ధులకు ఉండరాదు. కానీ, ఈ నిబంధనలు ఏవీ దుకాణాల నిర్వాహకులు పాటించడం లేదు. నరసన్నపేటలో బంగారం, వస్త్ర దుకాణాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది వ్యాపారులు పెడచెవిన పెట్టారు. షాపుల్లోకి ఎక్కువమంది వినియోగారులను విడిచిపెడుతున్నారు. మాస్క్లు ధరించకుండా విక్రయాలు చేస్తున్నారు.