ఆరోగ్యశ్రీ వర్తించదంటూ ఆన్లైన్ మోసం?
ABN , First Publish Date - 2022-08-07T05:11:15+05:30 IST
జిల్లాలో ఆన్లైన్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవగాహన లోపంతో కొందరు ఆన్లైన్ కేటుగాళ్ల వలకు చిక్కి ఆర్థికంగా నష్టపోతున్నారు. తాజాగా బెండకాయలపేటలో ఓ ఇద్దరి గిరిజనుల నుంచి రూ.42వేలకు టోకరా వేశారు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి మండలం ముఖలింగాపురం పంచాయతీ బెండకాయలపేటకు చెందిన ఇద్దరు గిరిజనుల బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.42వేలు మాయమైంది.
ఖాతా నుంచి రూ.42 వేలు మాయం
మోసపోయిన ఇద్దరు గిరిజనులు
సచివాలయ అధికారులకు పిర్యాదు
(టెక్కలి రూరల్, ఆగస్టు 6)
జిల్లాలో ఆన్లైన్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవగాహన లోపంతో కొందరు ఆన్లైన్ కేటుగాళ్ల వలకు చిక్కి ఆర్థికంగా నష్టపోతున్నారు. తాజాగా బెండకాయలపేటలో ఓ ఇద్దరి గిరిజనుల నుంచి రూ.42వేలకు టోకరా వేశారు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి మండలం ముఖలింగాపురం పంచాయతీ బెండకాయలపేటకు చెందిన ఇద్దరు గిరిజనుల బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.42వేలు మాయమైంది. గ్రామానికి చెందిన బి.సోమేశ్వర్, గంగువాడ లక్ష్మీకి శనివారం సాయంత్రం ఓ అజ్ఞాత వ్యక్తి వేర్వేరుగా ఫోన్ చేశాడు. హెల్త్ విభాగం నుంచి మాట్లాడుతున్నాం. ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డు మీకు ఉంది. వాటికి సంబంధించి మీకు రూ.30వేలు మీ బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పి.. వారిద్దరి ఫోన్ నెంబరుకు పే రిక్వెస్ట్ పెట్టాడు. దానిని ఓకే చేయకపోతే ఆరోగ్యశ్రీ వర్తించదని పేర్కొన్నాడు. దీనిపై అవగాహన లేక వారిద్దరూ ‘పే రిక్వెస్ట్’కు అంగీకరించారు. యూపీఐ కోడ్, పాస్వర్డ్ కూడా చెప్పడంతో వెంటనే సోమేశ్వర్ బ్యాంకు ఖాతా నుంచి మూడు దఫాలుగా రూ.20వేలు, రూ.10వేలు, రూ.2వేలు చొప్పున మాయమయ్యాయి. లక్ష్మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.10వేలు మాయమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి.. నర్శింగపల్లి సచివాలయ అధికారులను ఆశ్రయించారు. మహిళా పోలీసు భారతిని సంప్రదించి.. తాము ఆర్థికంగా మోసపోయామని తెలిపారు. పీఫింగ్ మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్, రోస్ ఇంపెక్స్ తదితర కంపెనీల ద్వారా తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయమయ్యాయని వాపోయారు. ఇదే మాదిరి మండలంలో పలువురు ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ-2 గోపాలరావు వద్ద ప్రస్తావించగా ఆన్లైన్ మోసం ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.