చోరీకేసులో ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-03T10:36:23+05:30 IST

ద్విచక్రవాహన చోరీకేసులో ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ ప్రసాదరావు చెప్పారు.

చోరీకేసులో ఇద్దరి అరెస్ట్‌

నిందితులిద్దరూ విద్యార్థులే..


మదనపల్లె క్రైం, ఆగస్ట్‌ 2: ద్విచక్రవాహన చోరీకేసులో ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ ప్రసాదరావు చెప్పారు. ఆయన కథనం మేరకు.. సోమల మండలం కందూరు పంచాయతీ మసీదువీధికి చెందిన సయ్యద్‌ మహబూబ్‌బాషా కుమారుడు షావల్లీ(20), షేక్‌ ఖాదర్‌బాషా కుమారుడు సాదిక్‌(21) ఒకరు డిప్లొమా, మరొకరు ఐటీఐ చేస్తున్నారు. కొద్దిరోజులుగా జల్సాలకు అలవాటుపడిన వీరు దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని వాహన చోరీలు చేస్తున్నారు. నిందితులు ఇటీవల పుంగనూరు, మదనపల్లె వన్‌టౌన్‌ పీఎస్‌ల పరిధిలో మూడు ద్విచక్రవాహనాలను చోరీ చేశారు.


అదేవిధంగా సోమలలో ఓ ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ ప్రసాదరావు రెండురోజుల కిందట పట్టణ అన్నమయ్య సర్కిల్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా వారి గుట్టు రట్టయింది. ఈ కేసులో నిందితులను ఆదివారం రిమాండుకు తరలించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అయితే నిందితులిద్దరూ విద్యార్థులు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ రెండవ ఎస్‌ఐ లోకేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-03T10:36:23+05:30 IST