బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-13T05:54:45+05:30 IST

మండలంలో బుడ్డిబంద వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు.

బైక్‌లు ఢీకొని ఒకరి మృతి
సురేశ్‌కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

మరొకరికి తీవ్ర గాయాలు

బుడ్డిబంద వద్ద ప్రమాదం


రావికమతం, ఏప్రిల్‌ 12: మండలంలో బుడ్డిబంద వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సూర్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. 

మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన దేవగుప్త సురేశ్‌కుమార్‌ (35) సోమవారం అత్తవారింటికి ద్విచక్ర వాహనంపై మేడివాడ బయలుదేరాడు. బుడ్డిబంద వద్దకు వచ్చేసరికి ఎదురుగా బైక్‌పై వస్తున్న అచ్యుతాపురం మండలం పూడిమాడకకు చెందిన మైలపల్లి అశోక్‌రాజు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సురేశ్‌కుమార్‌ తల రోడ్డుకు బలంగా తగలడంతో అక్కడక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్‌రాజును చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. సురేశ్‌కుమార్‌ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం తరలించారు. మృతుడి తల్లి హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఆకుల సూర్యనారాయణ తెలిపారు. కాగా సురేశ్‌కుమార్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య సాయిలక్ష్మి గర్భవతి. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2021-04-13T05:54:45+05:30 IST