Yasin Malik: జైలులోనే ఐదు రోజులుగా నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2022-07-26T22:47:45+05:30 IST
కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (Yasin Mlik) తీహార్ జైలులో ఐదు రోజైన మంగళవారంనాడు కూడా నిరాహార దీక్ష ..
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (Yasin Mlik) తీహార్ జైలులో ఐదు రోజైన మంగళవారంనాడు కూడా నిరాహార దీక్ష (Hunger strike) కొనసాగిస్తున్నారు. ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రుబియా సయీద్ అపహరణ కేసు (Rubiya sayeed abduction Case)లో జమ్మూ కోర్టు విచారణకు తాను నేరుగా హాజరయ్యేందుకు అనుమతించాలని యాసిన్ మాలిక్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం నుంచి జైలోలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రుబియా సయీద్ కేసులో మాలిక్ నిందితుడిగా ఉన్నారు.
తీహార్ జైలు నంబర్-7లోని హై-రిస్క్ సెల్లో సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉన్న మాలిక్ను జైలులోని మెడికల్ ఇన్వెస్టిగేషన్ (MI) రూమ్కు తరలించారు. అక్కడే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు గమనిస్తూ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ యావజ్జీవ ఖైదు పడింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
కేంద్ర మాజీ హోం మంత్రి ముఫ్తి మొహమ్మద్ సయీద్ కుమార్తె అయిన రుబియా సయీద్ను 1989లో కిడ్నాప్ చేసిన ఘటనలో యాసిన్ మాలిక్ నిందితుడు. ఈ కేసులో సీబీఐ స్పెషల్ జడ్జి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన యాసిన్ మాలిక్... వ్యక్తిగతంగా తాను విచారణకు హాజరు కావాలనుకుంటున్నట్టు చెప్పారు. జమ్మూ జైలుకు తనను బదిలీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసానని, తద్వారా తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వగలుగుతానని కోర్టుకు ఆయన విన్నవించారు. ప్రాసిక్యూషన్ సాక్షులను వ్యక్తిగతంగా తాను క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నానని, జూలై 22 వరకూ కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తానని చెప్పారు. తన విజ్ఞప్తిని పట్టించుకోని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. కాగా, జమ్మూలోని ఏదో ఒక జైలుకు తనను షిఫ్ట్ చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు రాకపోవడంతో ఆయన శుక్రవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు.
నాటి కేసు...
రుబియా సయీద్ 1989 డిసెంబర్ 8న అహరణకు గురయ్యారు. జేకేఎల్ఎల్ ఈ అపహరణకు పాల్పడింది. కేంద్రంలోని అప్పటి వీపి సింగ్ ప్రభుత్వం బీజేపీ సపోర్ట్తో ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టడంతో ఐదురోజుల తర్వాత రుబియా విడుదలయ్యారు. కాగా, 2017 టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ను 2019లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గత మేలో ఆయనను దోషిగా పేర్కొంటూ యావజ్జీవ ఖైదు విధించింది.