‘ఒమైక్రాన్’ బాధిత దేశాల ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-12-16T14:11:09+05:30 IST
కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ విపరీతంగా వ్యాప్తిచెందిన విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలలో ఆర్టీపీసీఆర్, రాపిడ్ టెస్టు తదితర పరీక్షలు తప్పనిసరి అని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి
- 20 నుంచి అమలు
చెన్నై: కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ విపరీతంగా వ్యాప్తిచెందిన విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలలో ఆర్టీపీసీఆర్, రాపిడ్ టెస్టు తదితర పరీక్షలు తప్పనిసరి అని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తామని, ఏమాత్రం అనుమానం వచ్చినా సమీప ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించి ఐసపోలేషన్లో ఉంచి చికిత్సలందిస్తామని అధికారులు తెలిపారు. చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు విమానాశ్రయాల్లో ‘ఒమైక్రాన్’ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తీవ్ర నిఘా వేయనున్నట్టు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి ఫలితాలు వెలువడిన తర్వాతే వారిని విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు.
ఏడుగురిలో ఒకరికి ‘ఒమైక్రాన్’?: నైజీరియా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిలో ఒకరికి ‘ఒమైక్రాన్’ లక్షణాలు కనిపించడంతో స్థానిక గిండిలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రిలో ఐసోలేషన్కు తరలించారు. ‘ఒమైక్రాన్’’ బాధిత విదేశాల నుండి ఇప్పటివరకు వచ్చిన 11480 మందికి ఆరోగ్యశాఖ అధికారులు వైద్యపరీక్షలు జరిపారు. వీరిలో 37 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. వీరికి ‘ఒమైక్రాన్’ పరీక్షలు కూడా నిర్వహించారు. వీరిలో నలుగురికి ‘ఒమైక్రాన్’ సోకలేదని అధికారులు ప్రకటించారు. తక్కిన 33 మందికి సంబంధించిన వైద్యపరీక్షా ఫలితాలు వెల్లడించాల్సి వుంది. మూడు రోజులకు ముందు దోహా మీదుగా చెన్నైకి విమానంలో వచ్చిన నైజీరియాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి వైద్యపరీక్షలు జరిపి ఐసోలేషన్కు తరలించారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం మాట్లాడుతూ... నైజీరియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయని, వారిలో ఒకరిద్దరికి ‘ఒమైక్రాన్’ సోకి వుంటుందనే అనుమానంతో వారి నుంచి సేకరించిన శాంపిల్స్ను బెంగళూరులో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రయోగశాలకు పంపామని తెలిపారు. ఆ ఫలితాలు వెలువడిన తర్వాతే రాష్ట్రంలో ‘ఒమైక్రాన్’ అడుగుపెట్టిందీ లేనిదీ నిర్ధారణ అవుతుందన్నారు. ఇదిలా వుండగా కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు.