అక్రమార్కుల పాలిట సింహ స్వప్నమైన ఈ అధికారి.. Civil Service Examలో సత్తాచాటారు!
ABN , First Publish Date - 2022-06-01T21:06:34+05:30 IST
సివిల్స్.. సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. రాత్రీపగలు తేడా లేకుండా తీవ్రంగా కృషి చేస్తే తప్ప Civil Service Exam విజయం సాధించలేం. ఎంతో మందికి అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. కానీ ఉత్తరప్రదేశ్కు చెందిన
ఇంటర్నెట్ డెస్క్: సివిల్స్.. సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. రాత్రీపగలు తేడా లేకుండా తీవ్రంగా కృషి చేస్తే తప్ప Civil Service Exam విజయం సాధించలేం. ఎంతో మందికి అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. కానీ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన చిట్టచివరి ప్రయత్నంలో సివిల్స్లో సత్తాచాటి గెలుపును ఆస్వాధిస్తున్నారు. గతంలో రూ.83కోట్ల ప్రజాధనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకుని.. ఇపుడు విజయ తీరాలకు చేరిన ఆ వ్యక్తి పేరు రింకూ సింగ్ రాహీ(Rinkoo Singh Rahee). ఆయన సక్సెస్ స్టోరీలోకి ఓ లుక్కేస్తే..
ఉత్తరప్రదేశ్కు చెందిన Rinkoo Singh Raheeకు చిన్నతనం నుంచే ప్రజాసేవపై మక్కువ ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రొవిసియల్ సివిల్ సర్వీస్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనంతరం స్టేట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే స్కాలర్షిప్ సంబంధిత స్కామ్ బయటపడటంలో కీలక పాత్ర పోషించారు. సుమారు రూ.83కోట్ల ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే అందుకు ప్రతిఫలంగా ఆయన ప్రాణహానిని ఎదుర్కొన్నారు.
దుండగులు జరిపిన కాల్పుల్లోంచి ఏకంగా ఏడుసార్లు బయటపడ్డారు. కానీ ఈ దాడుల్లో ఓ కంటి చూపును పోగొట్టుకోవడమే కాకుండా వినికిడి సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ఉన్నత పదవిలో ఉంటే మరింత మెరుగైన సేవ చేయవచ్చనే ఉద్దేశంతో Civilsపై దృష్టి పెట్టారు. పలుసార్ల విఫలమై.. చిట్టచివరి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 683 ర్యాంకు సాధించి సత్తా చాటారు.
ఈ సందర్భంగా Rinkoo Singh Rahee మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ.. అభ్యర్థులకు బోధన చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు సివిల్స్ రాయాలంటూ తనను ప్రోత్సహించినట్టు వెల్లడించారు. పలుమార్లు విఫలమైనప్పటికీ.. చివరి అవకాశంలో విజయం సాధించినట్టు పేర్కొన్నారు.