అక్టోబరులో Covid తీవ్రరూపం
ABN , First Publish Date - 2022-06-18T16:33:46+05:30 IST
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజూ పెరుగుతున్నాయని జూన్ మూడోవారం నుంచి మరింత అధికం కావచ్చునని వైద్య ఆరోగ్యశాఖ
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్
బెంగళూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజూ పెరుగుతున్నాయని జూన్ మూడోవారం నుంచి మరింత అధికం కావచ్చునని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. అక్టోబరు నాటికి కరోనా తీవ్రరూపం దాల్చనుందని మంత్రి వివరించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాన్పూర్ ఐఐటీ నివేదికలు ఇవే వివరాలను సూచిస్తున్నాయన్నారు. జూన్ నెలాఖరుకు కేసులు పెరగనున్నాయన్నారు. ప్రస్తుతానికి నమోదవుతున్న కేసుల్లో 90 శాతానికిపైగా బెంగళూరులోనే ఉన్నాయన్నారు. కొన్ని జిల్లాల్లో పదికిలోపుగాను మరికొన్ని జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కావడం లేదన్నారు. కొవిడ్ ప్రబలినా సాధారణ లక్షణాలు ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బెంగళూరులో ఒకటి రెండు పాఠశాలల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయని సంబంధిత విద్యార్థులకు సెలవులు మంజూరు చేశామన్నారు. కొవిడ్ నియంత్రణకు ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు రూపొందించామన్నారు. విద్యార్థులు పాఠశాలలకు ప్రవేశించే వేళ థర్మల్ స్ర్కీనింగ్ జరపాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని విద్యాసంస్థలకు సూచించామన్నారు. ప్రజలు గుంపులున్నచోట జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుతానికి అన్ని సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.