కొండుపాలెంలో ప్రభుత్వ భూమి కబ్జా
ABN , First Publish Date - 2021-07-31T05:57:25+05:30 IST
మండలంలోని కొండుపాలెం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
రెండు ఎకరాలను దున్నేస్తున్న ఆక్రమణదారులు
ఫిర్యాదు అందినా పట్టని రెవెన్యూ అధికారులు
తుమ్మపాల, జూలై 30: మండలంలోని కొండుపాలెం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కబ్జాదారులు భూములను దున్నేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
కొండుపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 188, 189లో సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి రెండు రోజులుగా భూమిని దున్నే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకుడు శెట్టి వెంకటరమణ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంతో తాజాగా శుక్రవారం కూడా తహసీల్దార్కు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. కబ్జాదారులు భూమిని దున్నడంతో పాటు సుమారు 150 ట్రాక్టర్ల ఇసుకను తరలించేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరగా, కొండుపాలెంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నట్టు సమాచారం అందిందని, వెంటనే ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఆక్రమణదారులను గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.