కరోనా సోకిన ఊబకాయులు మరణించే చాన్స్ ఎక్కువ!
ABN , First Publish Date - 2020-05-04T18:42:28+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సోకుతోంది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. అయితే వైరస్ సోకినా అనేక మంది
తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సోకుతోంది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. అయితే వైరస్ సోకినా అనేక మంది ప్రాణహాని లేకుండా బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ మూలంగా ఎవరి ఎక్కువ ప్రాణ హాని ఉంటుందన్న దానిపై బ్రిటన్లో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో బయటపడిన విషయం కొంత మందిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఊబకాయం ఉన్నవారికి వైరస్ సోకితే మరణించే ముప్పు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా పురుషులకు ఈ రిస్క్ అధికంగా ఉన్నట్టు తేలింది. అయితే చైనాలో మాత్రం పరిస్థితి ఈ విధంగాలేదు. ఎందుకంటే ఆ దేశంలో ఊబకాయంతో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉండటమేనని తెలుస్తోంది.
కరోనా వైరస్ మూలంగా గర్భవతులు, వయసు పైబడిన వారు, ఇప్పటికే కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, పొగతాగే వారు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నట్టు ఇంతకు ముందు గుర్తించారు. మహిళలకన్నా పురుషులే వైరస్ బారిన పడటానికి అధిక అవకాశాలున్నట్టు పలు అధ్యయనాలు గుర్తించారు. యూకేలో తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఊబకాయం కలిగిన పురుషులు మరణించడానికి అధిక అవకాశం ఉన్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని 166 ఆస్పత్రుల్లోని 16,749 మందిపై నిర్వహించారు. ఊబకాయంతో ఉన్న పురుషుల్లో ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని గుర్తించారు.