కలికిరిలో ఆగని మృత్యు ఘంటికలు
ABN , First Publish Date - 2021-05-12T06:39:02+05:30 IST
కలికిరి మండలంలో కరోనా మహమ్మారికి బారిన పడి అశువులు బాస్తున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మంగళవారం ఏకంగా ఆరు మరణాలు నమోదయ్యాయి.
మంగళవారం ఆరుగురు మృత్యువాత
కలికిరి, మే 11: కలికిరి మండలంలో కరోనా మహమ్మారికి బారిన పడి అశువులు బాస్తున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మంగళవారం ఏకంగా ఆరు మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు బాధితులు రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆగిన దుర్ఘటనకు బలయ్యారు.మర్రికుంటపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు ఎం.వెంకటేశ్వరరావు (చిన్న కిష్షూ) మంగళవారం తెల్లవారు జామున మరణించారు. పది రోజులుగా తిరుపతి లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆయన వ్యా ధి సోకిన మొదట్లో స్థానికంగా చికిత్స పొందుతూ ఆలస్యం చేసిన కారణంగానే మృత్యువాత పడ్డారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా వీధిలోని టైలర్ అరుణమ్మ (55) ప్రాణాలు కోల్పోయింది. మొదట తిరుపతిలోని ఒక ఎముకల ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పరిస్థితి విషమించడంతో కు ప్పం పీఈఎస్ ఆసుపత్రికి వెళ్ళారు.అక్కడ పడకలు లేకపోవడంతో తిరిగి తిరుపతికి వెళ్ళే క్రమంలో మార్గ మధ్యంలో మృతి చెందింది. అంకెంవారిపల్లెకు చెందిన పి.పుష్పలత (30) బిడ్డకు జన్మనిచ్చిన 12 రోజులకు కరోనా బారిన పడి మృతి చెందింది. ప్రసవించిన వారం రోజుల తరువాత జరిపిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి తిరుపతి ఆసుపత్రుల్లో ప్రయత్నించి పడకలు లభించక కాలం గడిపింది. చివరికి సోమవారం రూయా ఆసుపత్రిలో చేరింది. అయితే రాత్రి 8.30 గంటలకు ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మాత్రం క్షేమంగా వుంది. ఇదే దుర్ఘటనలో కలికిరి చిరునామాతో రూయాలో చేరిన దామలచెరువుకు చెందిన ఫజులుల్లా (35) మృతి చెందాడు. ఆయన మొదట కలికిరిలోని సోదరి ఇంటికి చేరుకున్నాడు. ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేసే బావ పర్యవేక్షణలో చికిత్స పొందాలని ప్రయత్నించాడు. నాలుగు రోజులు స్థానికంగా చికిత్స తీసుకున్న అనంతరం పరిస్థితి విషమించడంతో తిరుపతి రూయాలో చేరాడు. అయితే సోమవారం రాత్రి రూయాలో ఆక్సిజన్ ఆగిపోయిన ఘటనకు బలయ్యాడు. ఇక పట్టణంలోనే పాత పోస్ట్ ఆఫీసు వీధికి చెందిన జైబూన్ బీ (72) కరోనా కారణంగా మరణించింది. కలికిరి పంచాయతీలోనే అండేకురవపల్లెకు చెందిన బాలాజీ (38) నెల్లూరు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మరణించాడు.మంగళవారం ఆరు మరణాలు నమోదు కావడంతో మండలం ఆందోళనకరంగా మారింది.