గుడిసెవాసుల గోస.. దరి చేరని రూపాయికే నీటి కనెక్షన్
ABN , First Publish Date - 2022-03-22T18:38:05+05:30 IST
గుడిసెవాసుల గోస.. దరి చేరని రూపాయికే నీటి కనెక్షన్.. రెండు రోజులకోసారి డ్రమ్ము నీరు సరఫరా..
- రెండు రోజులకోసారి డ్రమ్ము నీరు సరఫరా
హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : నగరంలోనే అది పెద్ద బస్తీ. అక్కడ నివాసం ఉండే నిరుపేదలు నీళ్ల కోసం తండ్లాడుతున్నారు. పనులు మానుకుని ఉచిత ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఐఎస్సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీ వాసుల గోస ఇది. ఇక్కడ సుమారు 13 వేల కుటుంబాలు 25 ఏళ్లుగా నివసిస్తున్నాయి. వీటిలో అత్యధిక శాతం గిరిజన కుటుంబాలే. ప్రభుత్వం మురికివాడలు, బస్తీలలో రూ.1కే నల్లా పథకం ప్రవేశపెట్టి గ్రేటర్లో అన్ని ప్రాంతాలలో కనెక్షన్లు ఇచ్చి ఉచిత నీటి సరఫరా చేస్తోంది. కానీ సింగరేణి గుడిసెవాసులకు కోర్టు తీర్పు సాకుతో అధికారులు మంచినీటి కనెక్షన్లు ఇవ్వడం లేదు. వాటర్బోర్డు ఉచిత ట్యాంకర్లే వారికి దిక్కు అవుతున్నాయి. రెండు రోజులకొకసారి వచ్చే ట్యాంకర్ ద్వారా ఒక్కో ఇంటికి కేవలం ఒక డ్రమ్ము నీటిని మాత్రమే అందిస్తున్నారు.
ఆదాయానికి గండి..
సింగరేణి గుడిసెవాసులకు నిత్యం 100-120 ట్యాంకర్ల ద్వారా ఉచితంగా వైశాలీనగర్ రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా సుమారు నెలకు రూ.10 లక్షల నుంచి 12 లక్షలు ట్యాంకర్ల యాజమానులకు వాటర్బోర్డు చెల్లిస్తోంది. కేవలం రూ.20 లక్షలు ఖర్చుతో గుడిసెల ప్రాంతంలో నీటి కనెక్షన్లు ఇస్తే మంచినీటి సమస్య తీరుతుంది. దీని ద్వారా వాటర్బోర్డుకు ఖర్చు మిగులుతుంది. కానీ ఆదిశగా అధికారులు అడుగులు వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి
సింగరేణి గుడిసెల్లోని పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు స్వప్రయోజనాలతో అమలు చేయడం లేదు. - ఆర్.శంకర్నాయక్, గిరిజన సంఘం, సింగరేణి కాలనీ
గుడిసెవాసులపై వివక్ష చూపొద్దు
వివాదంలో ఉన్న ఇతర మురికివాడలకు మంచినీటి, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారు. కానీ కోర్టు తీర్పు సాకుతో సింగరేణి గుడిసెలకు కనీసం మంచినీటి కనెక్షన్లు ఇవ్వకపోవడం దారుణం. ప్రతి గుడిసెకు రూ.1కే మంచినీటి కనెక్షన్లు మంజారు చేయాలి. - కొర్ర మోతీలాల్ నాయక్, అధ్యక్షుడు, సేవాలాల్ బంజారా సంఘం