కర్ణాటకలో ఎవరూ వెంటిలేటర్పై లేరు : సీఎం యడియూరప్ప
ABN , First Publish Date - 2020-04-05T15:03:01+05:30 IST
కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుతానికి
- వైద్య సామగ్రి కొరత లేదు
- అందరికీ మెరుగైన సేవలందిస్తున్నాం
బెంగళూరు : కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎవరూ వెంటిలేటర్పై లేరని ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. కరోనా వైర్సకు సంబంధించి విధానసౌధలో శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో బెంగళూరు నగరస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎవరికీ వెంటిలేటర్ అమర్చలేదని స్పష్టం చేశారు. 128మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందన్నారు. వీరిలో ఇరువురికి మాత్రమే ఆక్సిజన్ అమర్చామన్నారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, 11మంది కోలుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశాలకు అనుగుణంగా లాక్డౌన్ను పటిష్ఠంగా అ మలు చేస్తున్నామన్నారు. ఇళ్ళనుంచి ఎవరూ రోడ్లపైకి రావద్దని వైరస్ సోకే అవకాశాలు అధికమన్నారు. నియంత్రణకు ఏకైక మార్గం ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో ఉండడమేనన్నారు. రాష్ట్రంలో రేషన్కార్డులు లేకున్నా నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని అధికారులకు స్పష్టమైన సూచన చేశానన్నారు.
ప్రతి ఒక్కరికీ ఆహారం సమకూర్చే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఎంతోమంది దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారని వారందరికీ ధన్యవాదాలన్నారు. కరోనా నియంత్రణకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సహకరించాలని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలను చైతన్యపరచాలని సూచించానన్నారు. వైరస్ నియంత్రణకోసం తీసుకున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ ధార్మిక సదస్సుకు వెళ్ళి వచ్చినవారిలో వైరస్ ప్రబలుతోందని అందుకే వారందరికీ క్వారంటైన్కు తరలించామన్నారు. మైనారిటీ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశామన్నారు. వలస కార్మికులకు అవసరమైన సౌలభ్యాలు సమకూరుస్తున్నామన్నారు. వారిలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు. బెంగళూరులో 30కుపైగా ఫీవర్ క్లినిక్లు పనిచేస్తున్నాయని రోజూ వందలాదిమంది పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని మరిన్ని రోజులు ప్రజల సహకారంతో సంపూర్ణంగా తరిమికొడతామన్నారు. డీసీఎం అశ్వత్థనారాయణ, మంత్రులు ఆర్.అశోక్, సురేశ్కుమార్, డా.సుధాకర్, సోమణ్ణ, శివరాం హె బ్బార్, చీఫ్ సెక్రటరీ విజయ్భాస్కర్ పాల్గొన్నారు.