ప్రజావాణికి బదులు ఫోన్ఇన్ ప్రోగ్రాం
ABN , First Publish Date - 2020-08-02T10:47:09+05:30 IST
ప్రజావాణికి బదులు ఫోన్ఇన్ ప్రోగ్రాం
నేరుగా కలెక్టర్ ఫోన్ ద్వారా ఫిర్యాదులు తీసుకోనున్నారు
చేయవలసిన ఫోన్ నెంబర్ 08468-220252
కామారెడ్డి టౌన్, ఆగస్టు 1: ప్రతీ సోమవారం ప్రజా సమస్యలు తెలు సుకునేందుకు కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్ ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించేవారు. అయితే గత ఐదు నెల లుగా కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ప్రజావాణిని నిర్వహించడం లేదు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సమస్యలతో ఇబ్బందులు పడుతూ వీటిని ఎవరికి విన్నవించాలో ప్రజలు తర్జన భర్జన పడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సుదూరప్రాంతాల నుంచి విన్నవించుకునేందుకు ప్రతీరోజు కలెక్టరేట్కు వస్తున్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టర్ ప్రత్యామ్నాయ ఆలోచన చేసి ఫోన్ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ సోమవారం ప్రజావాణికి బదులుగా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.15 నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. కావున జిల్లా ప్రజలు తమ యొక్క సమస్యలను కలెక్టర్ కార్యాలయం టెలిఫోన్ నెంబరు 08468-220252కు ఫోన్ చేసి సమస్యలు విన్నవించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.