కసరత్తు షురూ
ABN , First Publish Date - 2020-09-24T07:39:06+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది
మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీ కాలం
అక్టోబరు 1 నుంచి కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియ
తుది జాబితా ప్రకటన జనవరి 18న
ఏలూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చి 29తో ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీ కాలం పూర్తి కానుంది. 2015 మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఆయన యూటీఎఫ్, పీడీఎఫ్, ఇతర ప్రజా సంఘాల మద్దతుతో పోటీచేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలి పారు. ఓటరు నమోదు అధికారిగా తూర్పు గోదావరి జిల్లా డీఆర్వో సీహెచ్ సత్తిబాబ వ్యవహరించనున్నారు. 2015లో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 21,899 మంది టీచర్లు కాగా వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు 9,245 మంది, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు 12,654 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారు 17,487 మంది. తాజాగా వీరితో సహా మిగిలిన టీచర్లు ఓటు హక్కు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
ఓటు నమోదు ప్రక్రియ అక్టోబరు 1న ప్రారం భమవుతుంది. నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ప్రకటన జారీ చేసిన తర్వాత ఓటు కోసం ఫారం-19 పూర్తి చేసి అందజేయాలి. ఓటు నమోదు ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుందా? ఆఫ్లైన్లో ఉం టుందా అనేది తేలాల్సి ఉంది. ఉపాధ్యాయ ఎన్నికల్లో పాల్గొనేం దుకు తాజాగా డీఎస్సీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు అవకాశం లేనట్టే. ఉపాధ్యాయుడిగా మూడేళ్లు సేవలందించిన వారికే ఓటరుగా అర్హత ఉంటుంది. జిల్లా బయటి నుంచి వచ్చి ఉద్యోగం చేసే వారికి ఓటు పొందే అవకాశం లేదు. జిల్లాలో నివాసం ఉండే ఉపాధ్యాయు లకే ఓటు వేసే ఛాన్స్ వస్తుంది. ఓటర్ల జాబితాకు సంబంధించి తుది జాబితా 2021 జనవరి 18కల్లా సిద్ధమవుతుంది.