సుశాంత్ కేసులో కొత్త లింకులు
ABN , First Publish Date - 2020-08-13T17:04:03+05:30 IST
సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజుకో విషయం బయటపడుతోంది.
ముంబై: సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజుకో విషయం బయటపడుతోంది. ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ, ఈడీ రంగంలోకిదిగి విచారణ ముమ్మరం చేశాయి. మరోవైపు సుశాంత్ది హత్యేనంటూ కుటుంబసభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేయడం కలకలం రేపుతోంది. ఈ కేసును ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ ఎన్సీపీ అధినేత శరద్పవర్ వ్యాఖ్యానించారు.
సుశాంత్ ప్రియురాలిని విచారించిన ఈడీ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. రియాతో ఎవరెవరికి లింకులున్నాయన్నదానిపై తీగ లాగింది. దీంతో అనేకమంది సెలబ్రెటీలు ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు సుశాంత్ మరణంపై స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ నోరు మెదపలేదు. అయితే అనూహ్యంగా రియా కాల్ డేటా రికార్డులో అమీర్ ఖాన్ పేరుండడం సంచలనం రేపుతోంది. అమీర్ ఖాన్కు రియా ఒకసారి ఫోన్ చేయగా ఆయన నుంచి మూడు ఎస్ఎంఎస్లు వచ్చినట్లు ఈడీ గుర్తించింది. ఈ కాల్ డేటా రికార్డుల్లో రకూల్ ప్రీత్ సింగ్కు రియా 30 సార్లు ఫోన్ చేయగా.. రకూల్ 14 సార్లు ఫోన్ చూసింది. అలాగే వారి మధ్య రెండు ఎస్ఎంఎస్లు పంపించుకున్నట్లు తెలిసింది. ఇక అదిత్య రాయ్ కపూర్కు 16 సార్లు రియా ఫోన్ చేయగా 7సార్లు అదిత్య ఫోన్ చేసినట్లు కాల్ డేటా రికార్డులు చెబుతున్నాయి. శ్రద్ధా కపూర్కు 3 సార్లు ఫోన్ చేయగా.. ఆమె రెండు సార్లు రియాకు ఫోన్ చేసింది. ఇటు టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రాణాకు రియా 7 సార్లు ఫోన్ చేయగా.. ఆయన 4సార్లు ఫోన్ చేసినట్లు తేలింది.