కొత్త విద్యా విధానం భేష్.. విద్వత్ పరిషత్‌లో వక్తలు

ABN , First Publish Date - 2020-08-09T22:28:52+05:30 IST

మోదీ సర్కార్ ప్రకటించిన జాతీయ విద్యా విధానంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ విభాగ్ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై

కొత్త విద్యా విధానం భేష్.. విద్వత్ పరిషత్‌లో వక్తలు

హైదరాబాద్: మోదీ సర్కార్ ప్రకటించిన జాతీయ విద్యా విధానంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ విభాగ్ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై ఆదివారం విద్వత్ పరిషత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మేధావుల సూచనలు, దేశవ్యాప్త సర్వే అనంతరమే నూతన విద్యా విధానంపై కేంద్రం ముందడుగు వేసిందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మెకాలే విద్యా విధానానికి ఇంగ్లండ్ మూలమని, ఆనాడు మెకాలే దేశవ్యాప్తంగా పర్యటించి... భారతీయ మూలాలను దెబ్బ కొట్టేలా విద్యా విధానానని తీసుకొచ్చారన్నారు. ధర్మాన్ని, సంస్కృతిని మనకు కాకుండా చేసేందుకు పాశ్చాత్య విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనదైన విద్యా విధానానికి మనం దూరమైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా విలువలు, మనిషిని మనిషిగా, చక్కటి వ్యక్తిత్వ వికాసం నిర్మాణం చేసే విధంగా మన విద్య ఉండాలన్నారు. ఇక సంస్థ కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణ రావు మాట్లాడుతూ.. ఆరేళ్ల లోపు వారికి 85శాతం మెదడు పెరుగుదల ఉంటుందన్నారు. అన్ని విషయాలను అవగాహన చేసుకునే సామర్థ్యం ఉంటుందన్నారు. కొత్త విద్యా విధానంలో ప్రకృతితో మమేకమవుతూ నేర్చుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు, ఓయూ మాజీ వీసీ తిరుపతి రావు, తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-08-09T22:28:52+05:30 IST