Maharashtra Crisis : ఏక్‌నాథ్ షిండేకు ఎమ్మెల్యేల బలం లేదు : సుప్రియ సూలే

ABN , First Publish Date - 2022-06-28T23:01:34+05:30 IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar

Maharashtra Crisis : ఏక్‌నాథ్ షిండేకు ఎమ్మెల్యేల బలం లేదు : సుప్రియ సూలే

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కుమార్తె సుప్రియ సూలే (Supriya Sule) మంగళవారం మహారాష్ట్ర (Maharashtra)లో రాజకీయ సంక్షోభం గురించి మీడియాతో మాట్లాడారు. మనది ప్రజాస్వామిక దేశమని, తప్పనిసరిగా చర్చలు జరపాలని అన్నారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల డిమాండ్లపై చర్చించి, తగిన పరిష్కారాన్ని సాధించాలని చెప్పారు. 


‘‘నేను జ్యోతిష్కురాలిని కాదు. నేను (ఎమ్మెల్యేల) సంఖ్య గురించి మాట్లాడను. కానీ ఇది ప్రజాస్వామ్యం, చర్చలు తప్పనిసరిగా జరగాలి. వారి డిమాండ్లు ఏమైనప్పటికీ చర్చల ద్వారా పరిష్కరించాలి’’ అని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల వర్గానికి శాసన సభలో తగిన సంఖ్యాబలం లేదన్నారు. షిండే వద్ద 50 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు తాను విన్నానని చెప్పారు. కాబట్టి ఆయనకు ఆధిక్యత ఉందని చెప్పలేమన్నారు. 


శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై అడిగిన ప్రశ్నకు సుప్రియ సూలే సమాధానం చెప్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈడీ నోటీసులు వస్తున్నాయన్నారు. ఇలాంటివి మన దేశానికి, రాజ్యాంగానికి శ్రేయస్కరం కాదన్నారు. 


ఇదిలావుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మంగళవారం రెబల్ ఎమ్మెల్యేలకు రాసిన బహిరంగ లేఖలో ఓ విజ్ఞప్తి చేశారు. ముంబై వచ్చి తనను కలవాలని చెప్పారు. ‘‘మీలో చాలా మంది మాతో సంప్రదిస్తున్నారు. మనం మాట్లాడుకుందాం. మీరు హృదయంలో ఇప్పటికీ శివ సైనికులే’’ అని పేర్కొన్నారు.


బీజేపీతో జట్టు కట్టి, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడని 17 మంది షిండే వర్గం ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు శివసేన చెప్పుకుంటోంది. 


Updated Date - 2022-06-28T23:01:34+05:30 IST