బల ప్రదర్శనపై నజర్‌

ABN , First Publish Date - 2022-07-02T05:10:49+05:30 IST

రేపు నగరంలో జరిగే బహిరంగసభకు

బల ప్రదర్శనపై నజర్‌

  • బీజేపీ బహిరంగసభకు ఉమ్మడి జిల్లా నుంచి 2లక్షలకుపైగా తరలింపు
  • శివారు నియోజకవర్గాల నుంచి భారీగా సమీకరణ
  • నియోజకవర్గాలు, బూత్‌లవారీగా బాధ్యతల అప్పగింత
  • ఆహ్వానితులకు స్వాగతం పలికే వారి జాబితాలో విశ్వేశ్వర్‌రెడ్డి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూలై 1) : రేపు నగరంలో జరిగే బహిరంగసభకు  ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచి భారీగా జనసమీకరణకు బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌నగరంలో బీజేపీ ఆదివారం నాడు పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులుకదుపుతున్న బీజేపీ నాయకత్వం ఈ బహిరంగసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అతిరథ మహరధులందరూ హాజరవుతున్న ఈ సభకు రాష్ట్రనలుమూలల నుంచి భారీగా జనాన్ని తరలిస్తున్నారు. ఈ సభను విజయవంతం  చేయడం ద్వారా రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సకు తామే ప్రత్యర్ధులమనే సంకేతాలు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకే బీజేపీ ఈసభ నిర్వాహణను సవాల్‌గా తీసుకుంది. రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచి ఎక్కువ మందిని సమీకరించేయత్నాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు రెండు లక్షలకు మందిపైగానే జనాన్ని సమీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు.  ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 15వేల మందిని తరలించేవిధంగా స్థానిక నేతలకు టార్గెట్‌లు పెట్టింది. ముఖ్యంగా నగర శివారు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జనాన్ని సమీకరించనుంది. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి , ఎల్‌బీనగర్‌, కుత్భుల్లాపూర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి 15వేల చొప్పున జనాన్ని సమీకరిస్తున్నారు. నగరానికి సుదూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి 5 నుంచి 10వేల మంది చొప్పున తరలిస్తున్నారు. జనసమీకరణకు  సంబంధించి పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, బూత్‌కమిటీలకు ఈ బాధ్యతలకు అప్పగించింది. నియోజకవర్గాల వారీగా  ర్యాలీగా వాహనాలతో  నగరానికి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బల ప్రదర్శనకు దిగాలని భావిస్తోంది. మరో వైపు ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైన నేపధ్యంలో టిక్కెట్‌ ఆశావాహులు జనాన్ని తరలించేందుకు పోటీపడుతున్నారు. నగర శివార్లలో ఇటీవల కాలంలో బీజేపీ బలం పుంజుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు పలు స్థానాల్లో అనేక మంది పోటీపడుతున్నారు. మరో వైపు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నుంచి కొందరు ముఖ్యనేతలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ మమ్మురంగా ప్రయత్నిస్తోంది.  అత్యంత గోప్యంగా ఈచర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రె్‌సను వీడి కొన్నాళ్లుగా తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన నేడు లేదా రేపు బీజేపీ అగ్రనేతల  సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభలో వేదికపైకి వచ్చే అతిథులకు పుష్షగుచ్ఛంతో స్వాగతం పలికే అవకాశాన్ని విశ్వేశ్వరెడ్డికి కల్పించనున్నట్లు తెలిసింది. 


ర్యాలీ విజయవంతం

ఇదిలా ఉంటే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం నగరానికి విచ్చేసిన  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో  ఘనస్వాగతం లభించింది. శంషాబాద్‌లో నిర్వహించిన ర్యాలీకి భారీగా పార్టీశ్రేణులు తరలివచ్చాయి. దారిపొడవునా నడ్డాకు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో  బీజేపీ నిర్వహించిన భారీ ర్యాలీ ఇదేకావడం గమనార్హం. కార్యకర్తల్లో జోష్‌ పెంచే విధంగా ర్యాలీ కొనసాగింది. 


Updated Date - 2022-07-02T05:10:49+05:30 IST