బాధితులకు అండగా ‘నారీసేన’

ABN , First Publish Date - 2021-05-17T05:54:26+05:30 IST

సమాజంలో మహిళలకు ఉపాధి అవకాశాలు, సామాజిక అంశాలపై దృష్టిసారించిన నారీసేన ఇప్పుడు కరోనా బాధితులకు చేయూతనిస్తోంది

బాధితులకు అండగా ‘నారీసేన’
సిద్దిపేటలో కొవిడ్‌ బాధితులకు అన్నం పార్మిల్‌ చేస్తున్న నారీసేన

కరోనా బారిన పడిన వారికి పౌష్టికాహారం 

ఇంటి వద్దకే పార్శిల్‌ చేరవేస్తున్న నారీసేన బృందం

జిల్లా అంతటా విస్తరించేందుకు కార్యాచరణ


సిద్దిపేటసిటీ, మే16: సమాజంలో మహిళలకు ఉపాధి అవకాశాలు, సామాజిక అంశాలపై దృష్టిసారించిన నారీసేన ఇప్పుడు కరోనా బాధితులకు చేయూతనిస్తోంది. కొవిడ్‌తో బాధపడుతున్న రోగులకు తక్షణ సాయంగా అన్నదానం చేస్తూ సిద్దిపేట నారీసేన జిల్లా అధ్యక్షురాలు దీప్తి శభాష్‌ అనిపించుకుంటున్నారు. సిద్దిపేట పట్టణాన్ని ఆదర్శంగా మార్చడానికి గతంలోనే స్వచ్ఛబడిని ప్రారంభించారు. అనంతరం 2018లో ప్రారంభమైన నారీసేనలోనూ భాగమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా పలు పట్టణాల్లో కొనసాగుతున్న నారీసేన సేవలను సిద్దిపేట కూడా తీసుకొచ్చారు. 

నారీసేన ఆధ్వర్యంలో కరోనా రోగులకు స్వయంగా అన్నం వండి పంపిస్తున్నారు. సిద్దిపేటలో ఉన్న కరోనా రోగుల సహాయార్థం వైద్యుల సూచన మేరకు పౌష్టికాహారాన్ని స్వచ్ఛబడి ప్రాంగణంలోనే వండుతున్నారు. అన్నం, పప్పు, గుడ్డు, అరటిపండు, సాంబారు, తదితర వంటకాలను ప్యాక్‌ చేసి బాధితుల ఇళ్లకు చేరవేస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. నారీసేనలో ఆసక్తిగల వారిని ఎంపిక చేసి వారి ద్వారా సిద్దిపేట జిల్లా అంతటా కొవిడ్‌ రోగులకు భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. 


పేదలకు చేయూతనివ్వాలి

- దీప్తీ, నారీసేన సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్‌

పేద మహిళలకు చేయూతనిచ్చేందుకు నారీసేనలో చేరా. నారీసేన ఫౌండర్‌ లలాతాచౌదరి నా గురించి విని నారీసేన సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. వారి సహకారంతో మొదటి పనిగా కరోనా రోగులకు మూడురోజులుగా అన్నదానం చేస్తున్నాం. మొదట నలుగురి తో ప్రారంభమైన నారీసేన ఇప్పుడు 52 మందికి చేరింది. 




Updated Date - 2021-05-17T05:54:26+05:30 IST