పోలీసుశాఖలో జాగిలాల పాత్ర కీలకం : సీపీ
ABN , First Publish Date - 2021-03-05T05:34:28+05:30 IST
పోలీసుశాఖలో జాగిలాల పాత్ర కీలకం : సీపీ
ఖమ్మం జిల్లాకు నార్కోటిక్ డాగ్ ‘స్కూబీ’ కేటాయింపు
ఖమ్మంక్రైం, మార్చి4: జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా ఆనవాళ్లు సేకరిం చేందుకు పోలీసులు చేసే ప్రయత్నంలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్ అన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ ఆద్వర్యంలో హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్సు ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలపాటు మాదకద్రవ్యాలను పసిగట్టే శిక్షణ పూర్తిచేసుకున్న నార్కోటిక్ డాగ్ ‘స్కూబీ’ని ఖమ్మం జిల్లాకు కేటాయించగా.. గురువారం అది ఖమ్మం చేరు కుంది. ఈ సందర్భంగా ఆ జాగిలం చేసిన విన్యాసాలను సీపీ వీక్షించారు. నిరంతర శిక్షణ, ఆహారం , వైద్యపర్యవేక్షణలో ఉండే జాగిలాలు గంజాయి లాంటి మత్తుపదార్థాల ఆచూకీ సులభంగా కనిపెట్టే కేసుల ఛేదనలో పోలీసు లకు వెన్నుదన్నుగా ఉంటున్నాయని సీపీ పేర్కొన్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని గంజాయి, మాదకద్రవ్యాల లాంటి వాటి అక్రమ రవాణాను పసి గట్టేందుకు ఈ జాగిలాన్ని కేటాయించారన్నారు. అలాగే మోయినాబాద్ ఇంటి గ్రేటెడ్ ఇంటిలిజెన్సు ట్రెయినింగ్ అకాడమీలో 45రోజులపాటు బాంబులను గుర్తించడం, నిర్వీర్యం చేయడంలో శిక్షణ పొందిన ఏఆర్ కానిస్టేబుళ్లు ఉదయ్కుమార్, రాముకు సీపీ ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ ప్రసన్నకుమార్, ఏసీపీ విజయ్బాబు, ఆర్ఐ రవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.