రెవెన్యూ అధికారిపై దాడి చేసిన గడ్డంగ్యాంగ్ను అరెస్ట్ చేయాలి: లోకేష్
ABN , First Publish Date - 2022-04-22T16:27:50+05:30 IST
మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారి అరవింద్పై దాడి ముమ్మాటికీ మాజీ మంత్రి కొడాలి నాని పనేనని..
అమరావతి: కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, మోటూరులో అర్ధరాత్రి సాగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారి అరవింద్పై దాడి ముమ్మాటికీ మాజీ మంత్రి కొడాలి నాని పనేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మట్టిమాఫియాను అడ్డుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్పై జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి పోయిన క్యాసినో స్టార్ విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నానన్నారు. ఇలా తన మాఫియా గ్యాంగ్లను అడ్డుకునే రెవెన్యూ అధికారులపై దాడులు చేయడమా? అని ప్రశ్నించారు. ఆర్ఐ అరవింద్ అదృష్టం బాగుండి బతికి బట్టకట్టారని, లేదంటే చంపేసేవారేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కాస్తా జాగ్రత్తగా వుండాలని సూచించారు. సీఎం ప్రోత్సాహంతోనే మట్టి మాఫియాలు, గడ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్ఐపై దాడిచేసిన మట్టిమాఫియా.. దాని వెనుకున్న గడ్డం గ్యాంగ్ బాస్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు రక్షణ కల్పించాలని లోకేష్ కోరారు.