జగన్రెడ్డి పాలనలోఆడబిడ్డలపై అఘాయిత్యాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్: లోకేష్
ABN , First Publish Date - 2021-09-09T16:12:38+05:30 IST
జగన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి: జగన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలోనే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. గుంటూరు నుంచి బైక్పై సత్తెనపల్లి వెళ్తున్న జంటపై దుండగులు దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసిందన్నారు. ఫిర్యాదు చెయ్యడానికి వెళితే ‘మా పరిధిలోకి రాదు.. వేరే పోలీస్ స్టేషన్కు వెళ్ళండి’ అని పోలీసులు చెప్పడం ఇంకా ఘోరమన్నారు. ఇంత విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా నన్ను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారని, రక్షణ కల్పించాల్సిన పోలీసుల్ని రాజకీయ కక్ష సాధింపులకు జగన్ రెడ్డి వాడుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని లోకేష్ అన్నారు.