శ్రీవారి ఆశీస్సులతో ‘నాంది’ సక్సెస్
ABN , First Publish Date - 2021-03-05T07:26:08+05:30 IST
శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తన ‘నాంది’ చిత్రం విజయం సాధించిందని హీరో అల్లరి నరేష్ అన్నారు.
హీరో అల్లరి నరేష్
తిరుమల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తన ‘నాంది’ చిత్రం విజయం సాధించిందని హీరో అల్లరి నరేష్ అన్నారు. నాంది చిత్రం విజయోత్సవాల్లో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో చిత్ర దర్శకుడు విజయ్, నిర్మాత సతీష్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాదే శ్రీవారి దర్శనానికి రావాలనుకున్నా, కరోనా కారణంగా కుదరలేదని చెప్పారు. త్వరలో మరో రెండు సినిమాల షూటింగ్ మొదలు కానుందన్నారు. కాగా, ఆలయం ముందు అల్లరి నరేష్ను చూసేందుకు సినీ అభిమానులు ఉత్సాహం చూపారు. అలాగే తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని ఈ బృందం దర్శించుకుంది. వీరికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగతం పలికారు.