ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలి
ABN , First Publish Date - 2022-07-06T07:09:27+05:30 IST
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడుల సాధనకు కృషి చేయాలని అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరారు. ఆయిల్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో అంబాజీపేట మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని వారు మంగళవారం ప్రారంభించారు.
అంబాజీపేట, జూలై 5: రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడుల సాధనకు కృషి చేయాలని అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరారు. ఆయిల్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో అంబాజీపేట మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని వారు మంగళవారం ప్రారంభించారు. అనంతరం మార్కెట్ కమిటీలో జరిగిన సమావేశంలో ఎంపీ అనురాధ మాట్లాడుతూ కొబ్బరి రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొబ్బరి రైతులు డ్రయర్స్, ఇతర యంత్ర పరికరాలను ఉపయోగించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కొబ్బరి రైతులకు పూర్తిస్థాయిలో అనుసంధానం చేయాలని రైతులు ఎంపీని కోరారు. కొబ్బరి కాయలను నాఫెడ్ కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలను నిరంతరం కొనసాగించాలని, తద్వారా మార్కెట్లో ధరలు పెరిగి నిలకడగా ఉంటున్నాయని రైతులు ఎంపీకి వివరించారు. ఈ విషయాలపై కేంద్ర అధికారులతో చర్చిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రంలో మొక్కలను ఎక్కువగా తయారు చేయా లని శాస్త్రవేత్తలకు సూచించినట్టు తెలిపారు. రూగోస్ తెగులు నిర్మూలనకు పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలకు వివరించానని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, వైస్ ఎంపీపీ నేతల నాగరాజు, సర్పంచలు నాగాబత్తుల శాంతకుమారి, దొంగ నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్పర్సన వాసంశెట్టి వరలక్ష్మి, సొసైటీ చైర్మన కొర్లపాటి కోటబాబు, ఆయిల్ఫెడ్, నాఫెడ్ అధికారులు యు.సుధాకరరావు, ఎండీ శర్మ, రైతులు, వ్యాపారులు టీకే రావు, అప్పన సతీష్ తదితరులు పాల్గొన్నారు.