అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-12-08T05:22:17+05:30 IST
అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని 31,39,40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
కామారెడ్డిటౌన్, డిసెంబరు 7: అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని 31,39,40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒ మైక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలని తెలిపారు. వార్డుల వారీగా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, వైద్యులు పాల్గొన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలి
వైద్యసిబ్బంది గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల స్థాయి అధి కారులు, వైద్యసిబ్బందికి సహకారం అందించాలని తెలిపా రు. డిసెంబరు 15లోగా గ్రామాల వారీగా 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. పీహెచ్సీల వారిగా వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్దోత్రే, ఇన్చార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటమాదవరావు, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి చంద్రశేఖర్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
సదాశివనగర్ : రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగిలో ప్రత్యామ్నాయ పంట సాగుపై రైతులకు జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రైస్మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకుని వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండవన్నారు. రైతులు పొద్దు తిరుగుడు, శనగ, వేరుశనగ, గోధుమ, పెసర తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో ప్రతీసారి ఒకేరకం పంటలు పండించవద్దని పంటల మార్పిడి విధానాన్ని అవలంభించాలన్నారు.