హిందువు అంత్యక్రియలకు ముస్లింల సాయం
ABN , First Publish Date - 2020-04-08T07:12:17+05:30 IST
కుల, మత, ప్రాంతాలు ఎన్ని ఉన్నా.. భారతీయులంతా ఒకటే. ఇది ఎన్నోసార్లు నిరూపితమైన విషయం. తాజాగా మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఒక ఘటన, ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.
ఎంపీలో పరిఢవిల్లిన మత సామరస్యం
భోపాల్, ఏప్రిల్ 7: కుల, మత, ప్రాంతాలు ఎన్ని ఉన్నా.. భారతీయులంతా ఒకటే. ఇది ఎన్నోసార్లు నిరూపితమైన విషయం. తాజాగా మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఒక ఘటన, ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇండోర్కు చెందిన ద్రౌపది బాయ్(65), చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. ఆమె ఆలన పాలనను పెద్దకొడుకు చూసుకుంటున్నాడు. తాజాగా ద్రౌపది కన్నుమూసింది. అయితే.. ఆమె కుటుంబసభ్యులు, బంధువులు లాక్డౌన్ కారణంగా అంత్యక్రియలకు రాలేని పరిస్థితి. ఈ క్రమంలో.. అక్కడి ముస్లింలంతా ఒక్కటై ద్రౌపది అంత్యక్రియలు జరిపించేందుకు ఆమె తనయుడికి సాయపడ్డారు. మృతదేహాన్ని తమ భుజాలపై ఎత్తుకుని రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రభూమికి తీసుకెళ్లడం దగ్గర్నుంచి, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేవరకూ ద్రౌపది కొడుకుకు అండగా నిలిచారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కష్టకాలంలో తోటివాడికి ఆదరువుగా నిలిచిన సదరు ముస్లింలపై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేశారు. భారతీయులెప్పుడూ ఒకతాటిపైనే ఉంటారన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇండోర్ ముస్లింలు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించారని కొనియాడారు.