ముస్లిం వ్యక్తితో బలవంతంగా Jai Shri Ram నినాదాలు...నిందితుడి arrest
ABN , First Publish Date - 2022-07-13T16:33:20+05:30 IST
మథుర నగరంలో కొందరు వ్యక్తులు ఓ ముస్లిం వ్యక్తితో బలవంతంగా ‘జై శ్రీరామ్’ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేపించి....
మధుర(ఉత్తరప్రదేశ్): మథుర నగరంలో కొందరు వ్యక్తులు ఓ ముస్లిం వ్యక్తితో బలవంతంగా ‘జై శ్రీరామ్’ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేపించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని మధుర పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు కథనం ప్రకారం, ముబిన్ అహ్మద్ అనే ముస్లిం వ్యక్తి ధర్మపురా కాలువ సమీపంలో తన ఆవులను మేపుతుండగా సోమవారం ఈ సంఘటన జరిగింది. కొంత మంది హిందువులు వచ్చి ముబిన్ ‘జై శ్రీరామ్’ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయమని బలవంతం చేశారు.హిందూ యువకులు ముబిన్ను దేశద్రోహి అని కూడా పిలిచారు. ఉదయపూర్లో కన్హయ్య లాల్ హత్యకు ముబిన్ ని నిందించారు. ఈ ఘటన మొత్తాన్ని సదరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ముబిన్ అహ్మద్ మధుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరిలో ప్రధాన నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ముబిన్ మాట్లాడుతూ, తన గ్రామంలో సోదరభావాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నందున తాను దుండగులు చేసిన డిమాండ్లను తాను నిరసించలేదని, అయితే వారు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలుసుకున్నప్పుడు, తాను కేసు పెట్టాలని నిర్ణయించుకున్నానన్నారు. ముబిన్ అహ్మద్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందున ఈ కేసులో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, వారిలో ఒకరైన జితేంద్రను అరెస్ట్ చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మధుర అభిషేక్ యాదవ్ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తమ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని ఎస్పీ హెచ్చరించారు.