అత్తింటివారిపై అల్లుడి దాడి

ABN , First Publish Date - 2021-10-19T05:05:47+05:30 IST

అత్తింటివారిపై అల్లుడి దాడి

అత్తింటివారిపై అల్లుడి దాడి
మృతుడు కొండలరావు

మామ మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

మైలవరం రూరల్‌, అక్టోబరు 18 : కట్నంగా ఇచ్చిన పొలం అమ్మడానికి ఒప్పుకోవడం  లేదని భార్య, అత్తింటివారిపై ఓ అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మామ మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం వెదురుబీడెం గ్రామానికి చెందిన కొలుసు ధనలక్ష్మికి, గన్నవరం మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన వీర్ల రాంబాబుతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పెళ్లి సమయంలో ఇచ్చిన అరెకరం పొలం అమ్మేద్దామని రాంబాబు తరచూ ధనలక్ష్మితో గొడవ పడుతున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా గొడవ జరగగా, ధనలక్ష్మి పిల్లల్ని తీసుకుని వెదురుబీడెంలోని పుట్టింటికి వచ్చేసింది. దీంతో రాంబాబు అత్తింటివారిపై రగిలిపోయాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మామ కొలుసు కొండలరావు (50), అత్త రమణ, వీర్ల ధనలక్ష్మి, భవానీపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కొలుసు కొండలరావు ఆసుపత్రిలో మృతిచెందగా, రమణ, ధనలక్ష్మిలకు తీవ్రగాయాలు కాగా, భవానీకి స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమించడంతో 108లో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. సీఐ పి.శ్రీను, ఎస్సై రాంబాబు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహానికి విజయవాడలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నిందితుడు వీర్ల రాంబాబు పరారీలో ఉన్నాడు. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 



Updated Date - 2021-10-19T05:05:47+05:30 IST