పండగ పూట విషాదం

ABN , First Publish Date - 2021-01-16T05:53:22+05:30 IST

సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా చేసుకోవాలని స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు.. అనుకోకుండా హత్యకు గురయ్యాడు. కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురంలో బుధవారం రాత్రి కోట నాగేశ్వరరావు (42) అనే కారు డ్రైవర్‌ను ఓ వ్యక్తి హతమార్చాడు.

పండగ పూట విషాదం
హత్యకు గురైన నాగేశ్వరరావు (ఫైల్‌)

- చిన్నహరిశ్చంద్రపురంలో హత్య

- కారుడ్రైవర్‌పై దాడిచేసి హతమార్చిన వైనం

- పాతకక్షలే కారణమని కుటుంబ సభ్యుల ఫిర్యాదు

కోటబొమ్మాళి, జనవరి 15: సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా చేసుకోవాలని స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు.. అనుకోకుండా హత్యకు గురయ్యాడు. కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురంలో బుధవారం రాత్రి కోట నాగేశ్వరరావు (42) అనే కారు డ్రైవర్‌ను ఓ వ్యక్తి హతమార్చాడు.  వివరాల్లోకి వెళితే.. విశాఖలో ఒక బిల్డర్‌ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు.. సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆయనతో పాటు వైజాగ్‌లో పనిచేస్తున్న మరో కారుడ్రైవర్‌ తమ్మినేని హరినారాయణ కూడా మరో వాహనంలో వచ్చాడు. నాగేశ్వరరావు, హరినారాయణ ఇద్దరూ బయట విందు, సరదాగా కాసేపు గడిపి.. రాత్రి 10 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. వీరిద్దరి రాక కోసం ఇదే గ్రామానికి చెందిన చింతాడ గోపి ఎదురుచూశాడు. గోపి కూడా విశాఖలో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చాడు. అయితే వైజాగ్‌ నుంచి తనను పిలవకుండా ఎందుకు వచ్చారని, హరినారాయణతో గోపి వాదిస్తుండగా.. నాగేశ్వరరావు ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో నువ్వ కలుగజేసుకోవద్దు. ఇంటికెళ్లిపో అంటూ హరినారాయణ సూచించాడు. దీంతో నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిపోతుండగా.. చింతాడ అప్పన్న అనే వ్యక్తి ఆయనపై దాడి చేసి హత్యాప్రయత్నం చేశాడు. రాళ్లతో తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాగేశ్వరరావు అపస్మారకస్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నరసన్నపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగేశ్వరరావు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.  దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నాగేశ్వరరావుకు భార్య పద్మావతితో పాటు కుమారులు చాణ్యక్య సాయి,  సంతోష్‌లు ఉన్నారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా తమ మధ్య ఉన్న నాగేశ్వరరావు ఆకస్మిక మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చిన నాగేశ్వరరావు అందరితోనే సరదాగా ఉండేవాడని.. స్థానికులు గుర్తుచేసుకున్నారు. పండగ పూట ఇటువంటి ఘటన చోటుచేసుకుందంటూ విషాదంలో మునిగిపోయారు.  


పాతకక్షలే కారణం


సుమారు రెండేళ్ల కిందట చింతాడ అప్పన్న బంధువు.. నాగేశ్వరరావు తండ్రి రామారావుకు చిల్లంగి పెట్టాడనే ఆరోపణ ఉంది. అప్పట్లో దూషించాడనే నెపంతో నాగేశ్వరరావుపై అప్పన్న కక్ష పెంచుకున్నాడని తెలుస్తోంది. అప్పటి నుంచి నాగేశ్వరరావును హతమార్చే అవకాశం కోసం అప్పన్న ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా గోపి, అప్పన్నలు పథకం ప్రకారం తన భర్తను రాయితో కొట్టి, ఇనుప చువ్వలతో పొడిచి హతమార్చారని నాగేశ్వరరావు భార్య పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, స్థానిక ఎస్సై వై.రవికుమార్‌లు సంఘటన స్థలానికి క్యూస్‌ టీంతో చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటన అనంతరం అప్పన్న, గోపీలు  పరారు అయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-01-16T05:53:22+05:30 IST