కులం పేరుతో దూషించాడని కమిషనర్‌పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-06T03:27:49+05:30 IST

కులం పేరుతో దూషించాడని కావలి మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, టీడీపీ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కులం పేరుతో దూషించాడని కమిషనర్‌పై ఫిర్యాదు
మున్సిల్‌ కమిషనర్‌పై ఒకటోపట్టణ సీఐకి ఫిర్యాదుచేస్తున్న టీడీపీ నేతలు

కావలి, జూలై 5: కులం పేరుతో దూషించాడని కావలి మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి,  టీడీపీ నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం కమిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ దళిత నేతలు ఆత్మకూరు నాగరాజు, యేగూరి చంద్రశేఖర్‌, జ్యోతి బాబూరావు ఒకటో పట్టణ సీఐ కే.శ్రీనివాసరావును కోరారు. వివరాల మేరకు.. ఈ నెల 2వ తేదీన తుఫాన్‌నగర్‌లోని టీడీపీ సానుభూతిపరుడు పఠాన్‌ అమీర్‌ఖాన్‌ గృహం వద్ద ఆక్రమణల పేరుతో రేకులషెడ్డును తొలగించిన విషయమై అడిగేందుకు టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడితో కలిసి మున్సిపల్‌ కార్యాలయానికి సోమవారం టీడీపీ నేతలు వెళ్లారు. ఆసమయంలో తమను చాంబర్‌లోకి పిలిచిన కమిషనర్‌ దుర్భాషలాడారని, మీ మాల, మాదిగలకు కులం బుద్ధులు పోవని, ఎవరికో ఒకరికి వత్తాసు పలుకుతుంటారని హేళనగా చిన్నచూపు చూస్తూ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మాజీ కౌన్సిలర్‌ అయిన ఇనాయత్‌ హుస్సేన్‌ను దివ్యాంగుడని కూడా చూడకుండా నోరుమూసుకో మంటూ కమిషనర్‌ బెదిరించారని, దీంతో ఆయన మనోభావం దెబ్బతినటంతో కన్నీటి పర్వమయ్యారని అందుకు బాధ్యుడైన కమిషనర్‌పై కేసు నమోదు చేయాలని కోరారు. 

మైనార్టీ బాలికను బెదిరించాడని టీపీఎస్‌పై... 

మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ బాబూరావు తనకు వేలు చూపించి బెదిరిస్తూ బూతులు తిట్టాడని అమీర్‌ఖాన్‌ కుమార్తె, మైనార్టీ బాలిక ఇష్రత్‌ తబుసుమ్‌ సోమవారం రాత్రి టూటౌన్‌ సీఐ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేసింది. ఇంటి ముందు రేకుల షెడ్డును కూల్చుతున్న విషయాన్ని ఫోన్‌లో వీడియో తీస్తుండగా ఏం బెదిరిస్తున్నావా నీ ఇల్లు కూడా కూల్చి వేస్తానని బెదిరించారని, దీంతో తాను భయాందోళనకు గురైనట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-06T03:27:49+05:30 IST