సిరిపురంలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్
ABN , First Publish Date - 2021-05-14T05:24:18+05:30 IST
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) సిరిపురంలోని తన ప్రధాన కార్యాలయం ఎదురుగా నిర్మించ తలపెట్టిన మల్టీ లెవెల్ కారు పార్కింగ్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్కు ఎట్టకేలకు ముందడుగు పడింది.
రూ.67.57 కోట్లలో నిర్మాణం
విజయ్ నిర్మాణ్కు దక్కిన కాంట్రాక్టు
18 నెలల్లో పనులు పూర్తికి ఒప్పందం
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) సిరిపురంలోని తన ప్రధాన కార్యాలయం ఎదురుగా నిర్మించ తలపెట్టిన మల్టీ లెవెల్ కారు పార్కింగ్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్కు ఎట్టకేలకు ముందడుగు పడింది. మూడేళ్ల క్రితమే ఈ ప్రతిపాదన వచ్చింది. డిసెంబరు, 2019లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్రక్రియ ఇప్పటికి టెండర్ ఖరారు దశకు చేరుకుంది. దీనికి రూ.80 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా తయారుచేశారు. దాని ప్రకారం రూ.68.25 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. దానిపై ఏపీ ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. విజయ్ నిర్మాణ్, నాగార్జున కనస్ట్రక్షన్స్, కేపీసీ ప్రాజెక్ట్స్ టెండర్లు వేశాయి. అనుకున్న దాని కంటే ఎక్కువకు బిడ్లు రావడంతో రివర్స్ టెండరింగ్కు వెళ్లారు. ఆ తరువాత ఎట్టకేలకు విజయ్ నిర్మాణ్ కంపెనీకి రూ.67.57 కోట్లకు టెండర్ ఖరారు చేసినట్టు వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు గురువారం తెలిపారు.
ఏమి నిర్మిస్తారు?
సిరిపురం జంక్షన్లో వీఎంఆర్డీఏకి 1.35 ఎకరాల స్థలం ఉంది. అందులో 11 అంతస్థుల భవనం నిర్మిస్తారు. అందులో ఐదు అంతస్థుల్లో కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్, మిగిలిన ఆరు అంతస్థులు వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటారు. 450 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.
నిబంధనలు ఏమిటంటే...?
ఈ భవనానికి అవసరమైన ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణం బాధ్యతలు అన్నీ కాంట్రాక్టర్వే. దీనిని మొదటి నుంచి చివరి వరకు అన్ని విధాలుగా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాజెక్టును ఒప్పందం జరిగిన నాటి నుంచి 18 నెలల్లో పూర్తిచేయాలి.