లండన్లో ముఖేష్ అంబానీ ఆ ఎస్టేట్ కొన్నది అందుక్కాదు..
ABN , First Publish Date - 2021-11-06T15:35:23+05:30 IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి, భారత కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించి.. లక్షల కోట్ల రూపాయలకు అధిపతిగా మారారు.
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి, భారత కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించి.. లక్షల కోట్ల రూపాయలకు అధిపతిగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ 11వ స్థానంలో నిలిచారు. దీంతో ఆయన గురించి ప్రతి చిన్న వార్త కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ముఖేష్ అంబానీ గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.
ఆయన లండన్లో స్టోక్ పార్క్ ఎస్టేట్ను కొనుగోలు చేశారని.. ఇకపై కుటుంబంతో కలిసి ఆయన అక్కడకు షిఫ్ట్ అవుతారన్నది ఆ వార్త సారాంశం. దీనిపై తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. ఓ పత్రికా ప్రకటన ద్వారా ముఖేష్ అంబానీ కుటుంబం లండన్లో సెటిల్ అవుతామంటూ వస్తున్న వార్తలను నిరాధారమైనదిగా తేల్చారు. లండన్కే కాదు.. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి కూడా షిఫ్ట్ అవ్వాలనే ఆలోచన ముఖేష్కు గానీ.. ఆయన కుటుంబానికి గానీ లేదని రిలయన్స్ గ్రూప్ పత్రికా ప్రకటనలో తేల్చి చెప్పింది.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీ లండన్లోని స్టోక్ పార్క్ ఎస్టేట్ను ఇటీవల కొనుగోలు చేసిన వార్త నిజమేనని.. అయితే ఈ ఎస్టేట్ను ప్రీమియర్ గోల్ఫింగ్ క్లబ్తో పాటు క్రీడా రిసార్ట్గా మార్చాలనే ఉద్దేశంతోనే కొనుగోలు చేశామని స్పష్టతనిచ్చింది. లండన్లో ఈ ఎస్టేట్ కొనుగోలుతో భారత్కు మాత్రమే ప్రసిద్ధమైన ఆధిపత్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే లక్ష్యంతోనే ఎస్టేట్ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ గ్రూప్ ప్రకటించింది. ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ముంబైలోని యాంటిలియాలో 400,000 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఇంటిలో ఆయన కుటుంబం నివాసముంటోంది.