మూడు దశాబ్దాలైనా.. అందని పరిహారం!
ABN , First Publish Date - 2022-04-16T04:54:46+05:30 IST
మూడు దశాబ్దాలు గడుస్తున్నా ముంపు పరిహారం అందలేదని చిన్నపోతుల ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘చిన్న బోతుల’ నిర్వాసితుల ఆవేదన
రేపు మాపు అంటున్న అధికారులు
లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్ 15: మూడు దశాబ్దాలు గడుస్తున్నా ముంపు పరిహారం అందలేదని చిన్నపోతుల ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాలెంగొల్లపల్లె చిన్నపోతులపల్లె పైభాగాన 1990లో చిన్నపోతుల ప్రాజెక్టు నిర్మించారు. అందుకోసం 300 ఎకరాలకుపైగా సేకరించారు. ఇందుకు సంబంధించి ఎకరాకు రూ. 30 వేలకుపైగా పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ మేరకు 70 శాతం మందికి మాత్రమే పరిహారం అందింది. మిగిలినవారిని రేపు మాపంటూ 30 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో 2008లో అప్పటి జాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్, ఆర్డీవో భాషా నిర్వాసితులకు ఎకరాకు రూ.60 వేలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటిదాకా పరిహారం అందలేదు. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తా మని 4 నెలల క్రితం గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులు హడావుడి చేశారని, ఆ తర్వాత అయిపులేకుండా పోయారని చిన్నరాయుడు, ఈశ్వరమ్మ, వెంకటరమణ, వెంకట్రమణనాయుడు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాసితులకు పరిహారం అందించాలని వారు కోరారు.