నగదు డ్రాపై ఎంపీడీవోకి కాంట్రాక్టర్ ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-10-26T03:25:52+05:30 IST
గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పంచాయతీ ఖాతాలో ఇటీవల ప్రభుత్వం జమ చేసిన నగదును నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారని గణేశ్వరపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పేరం సుధాకర్రెడ్డి సోమవారం ఎంపీడీవో సురేష్బాబుకు ఫిర్యాదు చేశారు.
వరికుంటపాడు, అక్టోబరు 25: గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పంచాయతీ ఖాతాలో ఇటీవల ప్రభుత్వం జమ చేసిన నగదును నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారని గణేశ్వరపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ పేరం సుధాకర్రెడ్డి సోమవారం ఎంపీడీవో సురేష్బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో సీసీరోడ్లు, అంగన్వాడీ భవనాలు తదితర పనులు చేపట్టామన్నారు. ఆ పనులకు సంంధించిన ఎఫ్టీవోలు, ఎం బుక్కులు ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచు కుమ్మక్కై తనకు అందాల్సిన రూ.10 లక్షలను పథకం ప్రకారం డ్రా చేసి స్వాహా చేశారంటూ ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశానన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కాలయాపన చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టి న్యాయ పరంగా తాను చేసిన పనులకు మంజూరైన నగదును తనకు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు. లేకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.