అది స్కామ్ కాదా?.. జగన్పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం
ABN , First Publish Date - 2020-09-17T01:17:36+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రాజధానిపై జగన్ అప్పుడొక మాట, ఇప్పుడొక మాట్లాడుతున్నారని...
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రాజధానిపై జగన్ అప్పుడొక మాట, ఇప్పుడొక మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి అసెంబ్లీ సాక్షిగా జగన్ మద్దతిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ‘‘రాజధాని అక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుంది’’ అని టీడీపీ ప్రచారం చేయలేదన్నారు. కర్నూలు, వైజాగ్, అమరావతి అంటూ మూడు ముక్కలు చేయడం ఎలాంటి స్కామ్ అవుతుందో కడప ఎంపీ మిథున్ రెడ్డే చెప్పాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మూడు చోట్ల రాజధాని అనడం స్కామ్ కాదా అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 43 వేల కోట్ల దుర్వినియోగం కేసులో నిందితులుగా ఉన్న జగన్.. ఆ కేసులకు ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. బెయిల్ తీసుకుని బయట తీరుగుతున్న జగన్ న్యాయ వ్యవస్థలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే భయపడే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ఎండగడితే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.