తాడి గ్రామాన్ని తరలించండి

ABN , First Publish Date - 2022-06-29T06:27:42+05:30 IST

ఫార్మా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, తరచూ ఫార్మా ప్రమాదాలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని త్వరగా గ్రామాన్ని తరలించే ప్రక్రియ చేపట్టాలని తాడి నివాసితులు మంగళవారం ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను వేడుకున్నారు.

తాడి గ్రామాన్ని తరలించండి
గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు గ్రామస్థుల వేడుకోలు 

పరవాడ, జూన్‌ 28: ఫార్మా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, తరచూ ఫార్మా ప్రమాదాలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని త్వరగా గ్రామాన్ని తరలించే ప్రక్రియ చేపట్టాలని తాడి నివాసితులు మంగళవారం ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను వేడుకున్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 80వ వార్డు పరిధి పెదతాడి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ 23. 99 లక్షలతో చేపట్టనున్న అదనపు భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పలువురు గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఫార్మా కాలుష్యం కారణంగా పడుతున్న ఇబ్బందులను వివరించారు. గ్రామంలో తాగునీరు పూర్తిగా కలుషితమైపోయిందని, నీళ్ల క్యాన్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. తాగునీరు సరఫరా చేయాలని జీవీఎంసీ అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈసందర్బంగా జనసేన  పార్టీకి చెందిన గొల్లవిల్లి శ్రీను, గొల్లవిల్లి రాజు తదితరులు గ్రామాన్ని తరలించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. 

తాడి తరలింపునకు కృషి

తన రాజకీయ భవిష్యత్తు తాడి గ్రామం తరలింపుపైనే ముడిపడి ఉందని, గ్రామాన్ని తరలించేందుకు కృషి చేస్తానని గ్రామస్థులకు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామం తరలింపునకు సంబంధించి జీవోను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి తాగునీరు అందించేలా జీవీఎంసీ అధికారులతో మాట్లాడతానన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గనిరెడ్డి కనకరాజు, బంతికోరు గోవింద, పోలారావు, పితాన నీలకంఠరావు, ఎంఈవో సునీత, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T06:27:42+05:30 IST