మరిన్ని సడలింపులు

ABN , First Publish Date - 2020-05-29T10:24:06+05:30 IST

జిల్లాలో 65 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన అనంతరం సడలింపులను అధికారులు గురువారం మరింతగా ..

మరిన్ని సడలింపులు

ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 65 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన అనంతరం సడలింపులను అధికారులు గురువారం మరింతగా ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో   దుకాణాలు తెరుచుకున్నాయి. చాలారోజుల తర్వాత జిల్లా అంతటా జనసంచారం, వాహనాల రాకపోకలు కనిపించి సందడి వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి ఒంగోలులో ఉదయం నుంచి రద్దీ వాతావరణం కనిపించింది. తొలి కరోనా పాజిటివ్‌ కేసు ఒంగోలులో దాదాపు 70రోజుల క్రితం రాగా అప్పటి నుంచి నగరంలో ఆంక్షలు ప్రారంభమయ్యాయి. జనజీవనం ఒకరకంగా స్తంభించినంత పనైంది. చీరాల, కందుకూరు, కనిగిరి, చీమకుర్తి, మార్కాపురంతో పాటు మరికొన్ని ఇతర మండలకేంద్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.


నాల్గవదశ లాక్‌డౌన్‌ నుంచి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వెసులుబాటులు ఇస్తూ వస్తున్న అధికారులు గురువారం నాటికి వాటిని మరింతగా పెం చారు. ఒంగోలులో రెండు కాలనీలు మినహా మిగతా మొత్తాన్ని నాన్‌కంటైన్మెంట్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో అత్యధిక ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల పూజలు చేసి మరీ దుకాణదారులు వాటిని తెరవడం కనిపించింది. బట్టలు, నగలు, చెప్పులు వంటివాటితో పాటు ప్యాన్సీషాపులు, సెలూన్లు, టైలరింగ్‌ ఇతరత్రా పలురకాల దుకాణాలన్ని కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకు, మరికొన్నిచోట్ల సాయంత్రం వరకు పనిచేశాయి. శుక్రవారం నుంచి మరికొంత సడలింపులు పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2020-05-29T10:24:06+05:30 IST