8 తరగతులకు 5 గదులు!
ABN , First Publish Date - 2021-04-17T03:45:12+05:30 IST
ఉదయగిరి బీసీ కాలనీ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇరుకు గదుల్లో విద్యార్థులు విద్యాబోధన కొనసాగిస్తున్నారు.
ఇరుకు గదుల్లో విద్యార్థుల కష్టాలు
తల్లిదండ్రుల్లో కరోనా భయం
చదువు సాగిదెలా?
పట్టించుకోని అధికారులు
ఉదయగిరి రూరల్, ఏప్రిల్ 16: ఉదయగిరి బీసీ కాలనీ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇరుకు గదుల్లో విద్యార్థులు విద్యాబోధన కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో 8 తరగతులు ఉండగా 180 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి కేవలం 5 గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో విద్యాబోధన, కరోనా విజృంభణతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. ఉపాధ్యాయులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలలో కొవిడ్ నిబంధనలు పాటించే అవకాశం లేదు. ఇంతమంది విద్యార్థులకు గదులు సరిపోకపోవడంతో వరండాల్లో, మధ్యాహ్న భోజన సరుకులు నిల్ల చేసిన గదిలో బోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల కోసం వచ్చిన బల్లాలు, శుద్ధిజల కేంద్రం ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో ఆ సామాగ్రి కూడా అడ్డంకిగా మారింది. అదనపు తరగతి గది నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసి పాఠశాలకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.
ఇబ్బందిగా ఉంది
పాఠశాలలో విద్యార్థులు సంఖ్య అధికంగా ఉండడం, తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అసంపూర్తిగా ఉన్న తరగతి గదిని పూర్తి చేసి పూర్తయిన గదులను అప్పగించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం.
- షేక్ అరాఫత్, ప్రధానోపాధ్యాయులు