నెలాఖరున Dmk సర్వసభ్యమండలి సమావేశం

ABN , First Publish Date - 2022-07-03T13:06:23+05:30 IST

అధికార డీఎంకే సర్వసభ్యమండలి సమావేశం నెలాఖరున నిర్వహించేందుకు పార్టీ నాయకులు తగు సన్నాహాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో క్రమం

నెలాఖరున Dmk సర్వసభ్యమండలి సమావేశం

                        - సంస్థాగత ఎన్నికలకు అంగీకారం


చెన్నై, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అధికార డీఎంకే సర్వసభ్యమండలి సమావేశం నెలాఖరున నిర్వహించేందుకు పార్టీ నాయకులు తగు సన్నాహాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో క్రమం తప్పకుండా నిర్ణీత గడువులోపు సంస్థాగత ఎన్నికలను నిర్వహించే ఏకైక పార్టీగా డీఎంకే పేరుగడించింది. ఆ మేరకు ఇటీవల పార్టీ గ్రామీణశాఖలకు, వార్డు కమిటీలకు, నగర శాఖలకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం జోనల్‌ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. త్వరలో కార్పొరేషన్‌ నగరాల శాఖలకు, ఆ తర్వాత జిల్లా శాఖలకు ఎన్నికలు జరుపనున్నారు. డీఎంకేలో 70కి పైగా జిల్లా శాఖలు ఉన్నాయి. ఈ ఎన్నికలను నెలాఖరులోపు ముగించాలని పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయించింది. జిల్లాశాఖల్లో ముప్పావు శాతం శాఖలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 20 రోజులలోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని డీఎంకే సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. సంస్థాగత ఎన్నికల్లో గెలిచినవారికి సర్వసభ్యమండలి సమావేశం ఆమోదం తెలుపాల్సి ఉంది. ఆ మేరకే నెలాఖరున సర్వసభ్యమండలి సమావేశాన్ని జరుపనున్నారు. డీఎంకే సర్వసభ్యమండలి సమావేశాలు ఇప్పటివరకూ తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో నిర్వహించటం ఆనవాయితీ. అయితే ఈ సారి సర్వసభ్యమండలి సమావేశం మరో ప్రాంతంలో నిర్వహించే విషయమై పార్టీ సీనియర్‌ నాయకులు ఇటీవల చర్చలు జరిపారు. ట్రాఫిక్‌ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాన్ని, అదే సమయంలో  వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని నాయకులు ప్రతిపాదించారు. ఆ మేరకు అమింజికరై పచ్చయప్పన్‌ కళాశాల ఎదురుగా ఉన్న సెయింట్‌ జాన్స్‌ పాఠశాల మైదానంలో సర్వసభ్యమండలి సమావేశాన్నిజరపాలని ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో పార్టీ సీనియర్‌ నాయకులు శనివారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలన జరిపారు.

Updated Date - 2022-07-03T13:06:23+05:30 IST