కరోనా నుంచి కోలుకుని 10 రోజులు... తిరిగి 10 మందికి పాజిటివ్!
ABN , First Publish Date - 2020-07-15T11:14:56+05:30 IST
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ఒకసారి కరోనా నుంచి కోలుకున్న బాధితులు తిరిగి పాజిటివ్గా మారుతున్న ఉదంతాలు...
మొహాలి: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ఒకసారి కరోనా నుంచి కోలుకున్న బాధితులు తిరిగి పాజిటివ్గా మారుతున్న ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి కేసులు పంజాబ్లో వెలుగు చూశాయి. ఇంతకుముందు కరోనా పాజిటివ్ అయిన 10 మంది బాధితులు కోలుకొని, డిశ్చార్జ్ అయిన తరువాత తిరిగి వ్యాధి బారిన పడ్డారు. మొహాలికి చెందిన 10 మంది బాధితులు చికిత్స తీసుకుని, వారి రిపోర్టు నెగిటివ్ వచ్చిన తరువాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇది జరిగిన 10 రోజుల తరువాత వారు తిరిగి కరోనా పాజిటివ్గా మారారు. ఇటువంటి కేసులు బయటకువస్తున్న నేపధ్యంలో వైరస్ నుంచి కోలుకుంటున్నవారిలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా ఈ విషయమై మీడియా వైద్యులను సంప్రదించగా, కరోనా బాధితుల విషయమై ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం బాధితుడు వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తప్పనిసరిగా ఒక వారం రోజులు హోం క్వారంటైన్లో ఒంటరిగా ఉండాలని మొహాలి ఆసుపత్రికి చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ మంజిత్ సింగ్ స్పష్టం చేశారు. కోలుకున్న తర్వాత కూడా కరోనా టెస్టు చేయాల్సినవసరం ఉండదన్నారు. ఇటువంటప్పుడు ఎవరైనా పాజిటివ్గా కనిపించినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ మార్గదర్శకాలలో పేర్కొన్నారన్నారు. అటువంటివారెవరైనా ఉంటే, తిరిగి వైద్యులను సంప్రదించాలన్నారు. కాగా కరోనా నుంచి కోలుకొని, తిరిగి పాజిటివ్గా మారిన సంఘటన ఇదేమీ మొదటిది కాదు. ఇంతకుముందు కూడా హిమాచల్ప్రదేశ్, కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.