దర్బంగా ప్రచారంలో తలపడనున్న మోదీ, రాహుల్

ABN , First Publish Date - 2020-10-28T15:35:35+05:30 IST

ఓవైపు బీహార్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..

దర్బంగా ప్రచారంలో తలపడనున్న మోదీ, రాహుల్

పాట్నా: ఓవైపు బీహార్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారంనాడు రెండో విడత ప్రచారంలో తలపడుతున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించనున్నారు. మోదీ మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు. దర్బంగా, ముజఫర్‌పూర్, పాట్నాలో ఆయన పాల్గొంటారు. రాహుల్ గాంధీ వెస్ట్ చంపరాన్‌లోని వాల్మీకీ నగర్, దర్బంగాలోని కుషేశ్వర్ స్థాన్‌‌లో జరిగే ప్రచార ర్యాలీల్లో ప్రసంగిస్తారు. దర్బంగాలో మోదీ, రాహుల్ ముఖాముఖీ తలబడనుండటంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కుతోంది.


బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ, రాహుల్ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి. ఉభయులూ మూడు విడతల ఎన్నికల్లో భాగంగా పలు ర్యాలీల్లో సుడిగాలి పర్యటనలు సాగించనున్నారు. గత శుక్రవారం వీరిరువురూ బీహార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రోహటస్ జిల్లా, గయ, జబల్‌పూర్ ర్యాలీల్లో మోదీ పాల్గొనగా, నవడ, భాగల్‌పూర్ జిల్లాల్లో రాహుల్ ప్రచారం సాగించారు. లఢఖ్‌లో చైనా చొరబాట్లు, సైనికుల కుటుంబాలను అవమానించడం వంటి అంశాలపై ఇరునాయకులూ ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకున్నారు. 370 అధికరణ రద్దు, రైతు సంస్కరణ చట్టాలు,  ఆర్జేడీ జంగిల్ రాజ్, వలస సంక్షోభం, నిరుద్యోగం వంటి అంశాలు ఆయా పార్టీల కీలక ప్రచారాస్త్రాలుగా ఉన్నాయి.

Updated Date - 2020-10-28T15:35:35+05:30 IST