మోదీ ఒక కేడీ!
ABN , First Publish Date - 2021-04-13T05:16:48+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కేడీ అని 4వ తరగతి వరకు చదువుకుని దేశాన్ని పాలిస్తున్న దుర్మార్గుడని మాజీ ఎంపీ, తిరుపతి కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్
గూడూరురూరల్, ఏప్రిల్ 12: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కేడీ అని 4వ తరగతి వరకు చదువుకుని దేశాన్ని పాలిస్తున్న దుర్మార్గుడని మాజీ ఎంపీ, తిరుపతి కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. సోమవారం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ గ్యాస్, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందన్నారు. దుగరాజపట్నం ఓడరేవును రానీయకుండా అడ్డుకుంది చంద్రబాబునాయుడే అన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని సీఎం జగన్మోహన్రెడ్డి వేల కోట్లు సంపాదించాడన్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకున్నందుకు దళితుడైన బంగారు లక్ష్మణ్ను, ఓబీసీకి చెందిన లాలు ప్రసాద్యాదవ్ను జైలుకు పంపగా, కోటీశ్వరుడైన జగన్కు మాత్రం బెయిల్ ఎలా వచ్చిందో కోర్టులే చెప్పాలన్నారు. అంటరానితనాన్ని దేశంలో రూపుమాపి మతసామరస్యాన్ని చాటిచెప్పింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ప్రతి ఇంటికి టీవీ, కరెంటు, ఫోను, మంచినీళ్లు ఇచ్చిన ఏకైకపార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. షార్, శ్రీసిటీ, మన్నవరం భెల్ కర్మాగారం వంటి పారిశ్రామిక ప్రగతిని కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దుగరాజపట్నం పోర్టు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పంటా శ్రీనివాసులురెడ్డి, వేమయ్య తదితరులు పాల్గొన్నారు.