రేపటి నుంచి పది విద్యార్థులకు మోడల్ టెస్ట్–2
ABN , First Publish Date - 2021-05-16T05:34:30+05:30 IST
జిల్లాలోని అన్ని యాజమాన్యాల హైస్కూళ్ళల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా మోడల్ టెస్ట్–2 పరీక్షలు నిర్వహించాలని డీఈవో సీవీ రేణుక ఆదేశించారు.
ఏలూరు ఎడ్యుకేషన్, మే 15: జిల్లాలోని అన్ని యాజమాన్యాల హైస్కూళ్ళల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా మోడల్ టెస్ట్–2 పరీక్షలు నిర్వహించాలని డీఈవో సీవీ రేణుక ఆదేశించారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ రూపొందించిన ప్రశ్నపత్రాలను డీవైఈవోలు, ఎంఈవోల ద్వారా ప్రధానోపాధ్యాయులకు ప్రతిరోజూ సబ్జెక్టు వారీగా ఉదయం 9 గంటలకు ఇ–మెయిల్/వాట్సప్ గ్రూపు ద్వారా తెలియజేస్తామన్నారు. హెచ్ఎంలు సంబంధిత సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యార్థులకు వాట్సప్ గ్రూపుల ద్వారా తెలియజేసి నిర్ణీత టైమ్టేబుల్ ప్రకారం ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఆ ప్రకారం ఈ నెల 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీషు, 20న గణితం, 21న భౌతికశాస్త్రం, 22న జీవశాస్త్రం, 24న సోషల్ స్టడీస్, 25న కాంపోజిట్ సంస్కృతం, 26న సంస్కృతం–2 పరీక్షలు జరుగుతాయని వివరించారు.