మోదకొండమ్మ పాహిమాం
ABN , First Publish Date - 2022-05-17T06:24:53+05:30 IST
మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అమ్మవారికి విశేష పూజలు చేశారు.
వైభవంగా అమ్మవారి ఉత్సవాలు
పోటెత్తిన భక్తులు
పాడేరు, మే 16 (ఆంధ్రజ్యోతి): మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆలయంలోని మోదకొండమ్మను, శతకంపట్టు వద్ద కొలువైన ఉత్సవ విగ్రహాన్ని పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మోదకొండమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల రెండో రోజైన సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలోని మోదకొండమ్మను, శతకంపట్టు వద్ద కొలువైన ఉత్సవ విగ్రహాన్ని భక్తులు, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషనర్(ఐఏఎస్) కిల్లు శివకుమార్నాయుడు, ఆయన సతీమణీ ఐపీఎస్ అధికారిణి చేతన, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఎండీ ఖాన్, సినీ క్యారెక్టర్ ఆర్టిస్టు అల్లు రమేశ్, బీజేఎంవై రాష్ట్ర మాజీ కార్యదర్శి సోమవారం మోదకొండమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైౖర్మన్, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు తదితరులు స్వాగతం పలికి జ్ఞాపికలను అందించి సత్కరించారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, గాల్లో తేలియాడే పడవ, బ్రేక్డ్యాన్స్, చిన్న పిల్లలు ఆటల పరికాలు ఏర్పాటు చేయడంతో అక్కడ చిన్నాపెద్దలతో సందడి కనిపించింది. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక అదనపు ఎస్పీ జగదీశ్, చింతపల్లి ఏఎస్పీ తుషార్డూడి పర్యవేక్షణలో స్థానిక సీఐ బి.సుధాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ అందర్నీ ఆకట్టుకుంది.
నేడు మోదకొండమ్మ అనుపోత్సవం
మోదకొండమ్మ ముగింపు రోజైన మంగళవారం అనుపోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు శతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మ భక్తుల పూజలు అందుకుంటుంది. స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆహ్వానం మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అనుపోత్సవంలో పాల్గొనేందుకు రానున్నారు.