పాలవలస విక్రాంత్‌కు ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-11-11T04:19:38+05:30 IST

పాలవలస విక్రాంత్‌కు ఎమ్మెల్సీ

పాలవలస విక్రాంత్‌కు ఎమ్మెల్సీ
పాలవలస విక్రాంత్‌

పాలకొండ, నవంబరు 10 : డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌కు వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం రాత్రి ప్రకటించారు. సామాజిక సమీకరణలో భాగంగా తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి విక్రాంత్‌కు అధిష్ఠానం ఎమ్మెల్సీని ఖరారు చేసింది. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం పాలకొండ డివిజన్‌లోని పాలకొండ, పాతపట్నం, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో  కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయఢంకా మోగించడంలో విక్రాంత్‌ ప్రముఖ పాత్ర పోషించారు. తండ్రి పాలవలస రాజశేఖరం, తాత, నాన్నమ్మలు  పాలవలస సంగంనాయుడు, రుక్మిణమ్మల నుంచి రాజకీయ వారసత్వం పొందిన విక్రాంత్‌ తనదైన శైలిలో అనుభవాన్ని సంపాదించారు. గతంలో పాలవలస రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, డీసీసీబీ చైర్మన్‌గా, జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా వైసీపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన కృషిని గుర్తించిన సీఎం జగన్‌.. రాజశేఖరం కొడుకు విక్రాంత్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా విక్రాంత్‌కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.  

Updated Date - 2021-11-11T04:19:38+05:30 IST